CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టు నిధుల సమస్యను కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. గతంలో ఆమోదించిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడంతో జగన్ సర్కార్ ఖంగుతిన్నది. ఆ తరువాత పలు మార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపిలు సవరించిన అంచనాల ఆమోదం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. పెంచిన అంచనాల ఆమోదించకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టసాధ్యమే అవుతుంది. పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులపై కేంద్రం కనికరించింది.
Read More: Devineni Uma Remand: మాజీ మంత్రి దేవినేని ఉమాకు 14 రోజులు రిమాండ్..! రాజమండ్రి జైలుకు..!!
తాజాగా జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి నేతృత్వంలో వైసీపీ ఎంపిల బృందం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ చెప్పారు. గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వైసీపీ ఎంపిలకు వివరించారు. వచ్చే వారం కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానున్నది. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని విజయసాయి రెడ్డి మీడియాకు తెలిపారు.