CM YS Jagan: కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన అంశాలపై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశంలో విభజన హామీలు, 13 షెడ్యూల్ లోని సంస్థల అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో సోమవారం సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగిందని, విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయన్నారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. అప్పుల్లో 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారనీ, కానీ రెవెన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు,42 శాతం ఏపీకి వచ్చిందన్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుతాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీని నెరవేచ్చలేదనీ, పోలవరం కు నిధుల రాకలో సమస్యలు ఉన్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వంనుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదన్నారు. మరి విభజన కష్టాల నుండి రాష్ట్రం ఏ విధంగా బయటకు రాగలుతుందని ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టి పెట్టాలని సూచించారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే విభజన చట్టంలో హామీలు ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయామన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయామని, దీన్ని సర్దుబాటు చేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటునకు హామీ ఇచ్చిందన్నారు.
విభజన చట్టంలో ఉన్న ఈ స్పూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయన్నారు. తద్వారా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుందన్నారు. రాష్ట్రంలో పురోగమిస్తేనే దేశంలో కూడా పురోగమిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపి పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే విభజన నష్టాల నుండి గట్టెక్కగలుగుతుందన్నారు.
అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించామన్నారు. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత అని అన్నారు. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి సమగ్రమైన సహకారం, సహాయం అవసరమని, దీని కోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలని దిశానిర్దేశం చేశారు.
కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోరుతున్నామనీ, కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పై కేంద్రం హామీ ఇచ్చిందని, వీటన్నింటి కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం హామీ ఇచ్చిందని, స్టీల్ ప్లాంట్ కు సమీప ప్రాంతంలోఎన్ఎండీసీ నుండి గనుల కేటాయింపు చేయాలన్నారు. దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. అలానే వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు.
Women Kidnapped: పెట్రోల్ బంక్ సమీపంలో అందరూ చూస్తుండగానే సినీ పక్కీలో యువతి కిడ్నాప్..వీడియో వైరల్