ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ అచ్యుతాపురం సెజ్ లో టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో ఎనిమిది కంపెనీలకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ఆశీర్వదించేందుకు కాన్వాయ్ లో వెళుతుండగా, రోడ్డు పక్కన ప్రజలు జగన్ కోసం వేచి చూడటం చూసి వెంటనే ఆగారు. కాన్వాయ్ ను ఆపేసి.. కిందకు దిగి తన కోసం ఎదురుచూస్తున్న వారిని పిలిచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారి నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పక్కనే ఉన్న అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ఆపించి మరీ తమ సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు తీసుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ కాన్వాయ్ ఆపించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఇదే ప్రధమం కాదు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో బాధితుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. రీసెంట్ గా కాకినాడ పర్యటనకు వెళ్లిన సమయంలో .. జనాల మధ్య చండిబిడ్డతో ఓ తల్లి ఆవేదనగా అన్నా అన్నా అని పిలుస్తుండటం చూసి వెంటనే తన కాన్వాయ్ ను ఆపారు జగన్. ఆమెను దగ్గరకు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలానికి చెందిన తనూజ తన బిడ్డ అనారోగ్య సమస్య గురించి సీఎం జగన్ కు వివరించగా, వెంటనే వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆ తర్వాత ఆ బిడ్డకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.
తదుపరి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లి నూతన దంపతులు సూర్య, రాశిలను ఆశీర్వదించారు. ఇటీవల సూర్య, రాశి వివాహం జరిగింది. వీరి రిసెప్షన్ కు సీఎం జగన్ పాల్గొనాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్లలేదు. ఈ రోజు అనకాపల్లి పర్యటన సందర్భంలో సీఎం జగన్.. గణేష్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంలో వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ తన ఇంటికి సీఎం జగన్ రావడంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. మత్స్యకారుడినైన తన ఇంటికి జగన్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజును తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్