Cyclone michaung: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరికి 730 కి.మీ, చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930 కి.మీ, మచిలీపట్నానికి 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ ఓ ప్రకటన లో తెలిపారు. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా పయనించి ఇవేళ (శనివారం) బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుఫాను (సైక్లోన్ మిచాంగ్) గా బలపడుతుందని తెలిపారు. అనంతరం వాయువ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు – మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అన్నారు.
తుఫాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పారు. సోమవారం పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా లో అత్యంత భారీ వర్షాలు పడతాయన్నారు. తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తొంది.
తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తాడేపల్లి లో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసింది. తుఫాను ప్రభావం శనివారం నుండి మొదలై ఈ నెల అయిదవ తేదీ వరకూ కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సముద్రంలో చేపల వేటపై నిషేదం విధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నెంబర్ హెచ్చరిక జారీ అయ్యింది. తుఫాను కారణంగా వంద కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.