IPS AB Venkateshwara Rao: ఏపి ప్రభుత్వం తనను మరో సారి సస్పెండ్ చేయడంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితమే ప్రింటింగ్ అండ్ సర్వీసెస్ డీజీగా ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించాలన్న అభియోగంపై ప్రభుత్వం మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ సస్పెన్షన్ ఉత్తర్వులు తనకు చేతికి ఇంత వరకూ ఇవ్వలేదనీ, సోషల్ మీడియాలో మాత్రమే చూశానన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
IPS AB Venkateshwara Rao: ‘వారికి వర్తించనవి నాకెలా వర్తిస్తాయి’
ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమేననీ, ఏడాది క్రితం కేసు పెట్టినా ఇంత వరకూ చార్జిషీటు వేయలేదన్నారు ఏబీవీ. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు. ఈ సలహా ఏ తీసేసిన తహశీల్దార్ ఇచ్చారో, పనికి మాలిన సలహాదారు ఇచ్చారో నంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఒక సారి హైకోర్టు కొట్టేసినప్పుడు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మీద 12 సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసుల్లో చార్జ్ షీట్లు ఉన్నాయనీ.. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసులు, చార్జ్ షీట్లు ఉన్నాయనీ, వీరికి వర్తించనవి తనకెలా వర్తిస్తాయని ప్రశ్నించారు ఏబీ వెంకటేశ్వరరావు. తన సంతకాలను ఫోర్జరీ చేశారనీ మూడు సార్లు సీఎస్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. తనను ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర నుండి కొండను తవ్వుతూనే ఉన్నారనీ, ఇంత వరకూ ఒక్క ఎలుకను కూడా పట్టలేదని సైటైర్ వేశారు.
రూపాయి అవినీతి జరగని దగ్గర అవినీతి కేసు
వాళ్లు మాట్లాడితే ఇజ్రాయిల్ కంపెనీ అంటుంటారనీ, అదేమైనా సూట్ కేసు కంపెనీనా లేక కోల్ కత్తా కంపెనీనా అని ప్రశ్నించారు ఏబీవీ. రూపాయి అవినీతి జరగని దగ్గర అవినీతి కేసు ఏమిటని ప్రశ్నించారు. ఇజ్రాయిల్ కంపెనీకి రెండు లేఖలు రాశారనీ, ఎవ్వరికీ ఏ రూపంలోనూ ఒక్క రూపాయి చెల్లించలేదని వాళ్లే చెప్పారని, మరి ఏ ఆధారం ఉందని ఏసీబీ కేసు నమోదు చేశారని నిలదీశారు. కొందరు అధికారుల తీరు పట్ల ప్రభుత్వానికి, వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. సీఎంకు గానీ, సీఎస్ కు గానీ, డీజీపీకి గానీ కొన్ని పరిమితులు ఉంటాయనీ, పరిమితులు దాటి ఎవరూ వ్యవహరించకూడదన్నారు. తనపై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలవదని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇటీవలే తనకు పోస్టింగ్ ఇచ్చారనీ, ఇంతలోనే తాను ఏమి చేశానని సస్పెండ్ చేశారని ఏబీవి ప్రశ్నించారు.
ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తా
రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉండగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనీ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారనీ అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నాననీ అందువల్లనే తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వెనుక తనకేమి సంబంధం అని ప్రశ్నించారు. విచారించి తన ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇదే అంశాన్ని చెప్పుకుని ఎంత కాలం ప్రచారం చేస్తారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి నీ సంగతి చూస్తామని బెదిరించాడనీ, అర్ధరాత్రి సమయం కదా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో అని తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఆ ప్రజాప్రతినిధే బోరున ఏడ్చినట్లు మీడియాలో వచ్చిందన్నారు. రిటైర్ అయ్యేంత వరకూ ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తానని మరో ప్రజా ప్రతినిధి గతంలో తనను బెదిరించారన్నారు ఏబీవి. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తానని ఏబీవి చెప్పారు.