KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించాల్సిన సమస్య ఇది. సమాజంలో ఓ వైపు ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే… ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుంటే… కొందరు మాత్రం డబ్బు పిచ్చితో తప్పుడు పనులు చేస్తున్నారు. కరోనా వైద్యంలో వాడే రెమిడిసివర్ ఇంజెక్షన్ అడ్డదారిలో కొనుక్కునేలా చేస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు దోచుకుంటున్నారు.
ఏంటి దీని ఉపయోగం?
కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లు అవసరమైనంత వరకు అందుబాటులోకి రావడం లేదు. రెమిడిసివిర్ ఇంజక్షన్ కరోనా చికిత్సలో భాగంగా ఒక్కో కరోనా రోగికి ఆరు ఇంజెక్షన్లు కోర్సుగా వాడాల్సి ఉంటుంది. దీంతో కరోనా వచ్చిన రోగులు అందరికి ఆసుపత్రిలో చికిత్స కోసం దీన్ని తప్పనిసరిగా వాడుతున్నారు. దీనికి తోడు ఉన్న కాస్తో కూస్తో ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తుండడంతో పేద, మధ్య తరగతుల్లో ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో.. వారికి సరైన వైద్యం అందడం లేదు. రెమిడిసివర్ అందుబాటులో లేకపోవడంతో పాటు.. డిమాండ్ కూడా పెరగడంతో.. రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కార్పోరేట్ ఆస్పత్రులు కొన్ని ఫార్మా కంపెనీలు అలాగే డీలర్లు రంగంలోకి దిగుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎవరు స్థాయిలో వారు ఈ రెమిడిసివర్ ఇంజెక్షన్లను రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఏం జరుగుతోంది?
గత రెండు వారాల నుంచి ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా వేగంగా వైరస్ విస్తరిస్తోంది. చికిత్సలో కీలకమైన రెమిడిసివర్ను బహిరంగ మార్కెట్ లో విక్రయించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో కరోనా చికిత్సకు అనుమతించిన ఏపీలోని 200కిపైగా ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. ఆయా ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్, కేసుల తీవ్రత, ప్రభుత్వ ఆదేశాల బట్టి ఆసుపత్రులకు దీన్ని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అత్యధికంగా హెటిరో డీలర్ నుంచే మేజర్ షేర్ సరఫరా అవుతోంది. మార్కెట్లో ఇంకా మరో 5 కంపెనీల నుంచి ఈ ఇంజెక్షన్ వచ్చినా సరఫరా అనుకున్న మేర అందుబాటులోకి రాలేదు. రోజుకి 50 వేల ఇంజెక్షన్ల డిమాండ్ ఉంటే 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే సరఫరా అవుతున్న పరిస్థితి. దీంతో విపరీతంగా కొరత వచ్చేసింది. ఏపీలో రెమిడిసివర్ ఉత్పత్తి చేసే కంపెనీ ఒక్కటే ఉంది. దీంతో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా జరగడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి….
హైదరాబాద్లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కీలకమైన రెమిడిసివిర్ లభ్యత తక్కువగా ఉండటంతో బ్లాక్ మార్కెట్ను ప్రజలు ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ప్రజలను కొందరు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రజల దురదృష్టాన్ని క్యాష్ చేసుకుంటున్న వారి భరతం పట్టేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగాలని పలువురు కోరుతున్నారు.