YS Jagan: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నోటిఫికేషన్ పై సందేహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాధం పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. మూడు పేర్లను సూచిస్తూ ఆ పేర్లను మూడు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించాలని కోరారు ముద్రగడ.
తూర్పు లేదా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక దానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు, ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు. కోనసీమకు దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేర్లు పెట్టడానికి పరిశీలించాలని సీఎం జగన్ కు ముద్రగడ కోరారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి తమరు శ్రీకారం చుట్టారని ప్రత్రికల్లో చూశానని పేర్కొన్న ముద్రగడ.. తనదొక చిన్న మనవి అని, దయచేసి అవకాశం ఉంటే మనసు పెట్టి ఈ పెద్దల పేర్లను జిల్లాలకు పెట్టడానికి పరిశీలించాలని కోరారు.
జిల్లాలకు నేతల పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా, కడపకు వైఎస్ఆర్ కడప జిల్లాగా గతంలోనే పెట్టారు. ఇప్పుడు కొత్తగా బాలాజీ జిల్లా (తిరుపతి), ఎన్టీఆర్ (విజయవాడ) జిల్లా, శ్రీ సత్యసాయి బాబా జిల్లా (పుట్టపర్తి) అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు) ఇలా కొత్త జిల్లాలకు పేర్లు పెట్టారు. ముద్రగడ పద్మనాభం సూచనను సీఎం జగన్ పరిశీలనలోకి తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఈ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటూ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం నేతలు మహాత్మా జ్యోతిరావుపూలే పేరును, పలు దళిత సంఘాల నేతలు బాబూ జగజ్జీవన్ రామ్ పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలంటూ డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.