Narsapuram By Poll: వైసీపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తీవ్ర వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు రఘురామ. ఉప ఎన్నికలకు సిద్ధపడుతున్న రఘురామ.. వైసీపీని వ్యతిరేకించే పార్టీలు అన్నీ తనకు మద్దతు ఇస్తాయనీ, తద్వారా తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. పార్టీకి,ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే రఘురామ బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. రఘురామ రాజీనామాను స్పీకర్ ఆమోదించిన ఆరు నెలల లోపు నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంటుంది.
Narsapuram By Poll: తెరపైకి కొత్త పేరు
బీజేపీ ఇతర రాజకీయ పక్షాల మద్దతు అభ్యర్ధిగా రఘురామ పోటీ చేస్తున్న క్రమంలో వైసీపీ తరపున అభ్యర్ధి ఎవరు అవుతారు అనేది సర్వత్రా ఆసక్తికల్గిస్తోంది. నర్సాపురం పార్లమెంట్ స్థానంలో త్రిముఖ పోటీ జరిగితేనే వైసీపీకి అడ్వంటేజ్ ఉంటుంది అనేది పరిశీలకుల వాదన. అయినప్పటికీ అధికార పార్టీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు కొరకరాని కొయ్యగా మారిన రఘురామను దెబ్బకొట్టడానికి వైసీపీ సర్వశక్తులను ఒడ్డుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలం వరకూ రఘురామపై మాజీ ఎంపీ గోకరాజు గంగరాజును గానీ ఆయన కుటుంబంలోని వారిని గాని వైసీపీ రంగంలోకి దింపుతుందని భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీజీకే భానును బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీజీకె భాను
1985 బ్యాచ్ కు చెందిన అస్సొం – మేఖాలయ కేడర్ ఐఏఎస్ అధికారి ఎంవీజీకె భాను 1958లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. అత్యంత ప్రతిభావంతమైన అధికారులలో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. 1990లో విజయవాడ కార్పోరేషన్ ప్రత్యేక అధికారిగా పని చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయన కార్యదర్శిగా పని చేశారు. ఆ తరువాత సీఎం రోశయ్య వద్ద కార్యదర్శిగా పని చేశారు. 2018 వరకూ అసొం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసి పదవీ విరమణ పొందారు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. తదుపరి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన సామాజికవర్గానికి చెందిన భానును నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నికల బరిలో దించే అంశంపై వైసీపీ ఇప్పటికే సర్వేలు సైతం చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సాపురం నియోజకవర్గంలో కాపు, క్షత్రియ సామాజికవర్గ ఓటర్లే అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించి పరిస్థితి ఉంది. ఈ కారణంగా నర్సాపురంలో వైసీపీ అభ్యర్ధి గెలుపు బాధ్యతలను కాపు, క్షత్రియ వర్గానికి చెందిన మంత్రులకు జగన్ అప్పగిస్తారనేది సమాచారం. రఘురామకు టీడీపీ, జనసేన, బీజేపీ లు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ సైతం ఈ ఎన్నికను ప్రతిప్టాత్మంగా తీసుకుంటోంది.