Pawan Kalyan Vs Ambati Rambabu: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఒక్క రోజు దీక్ష నిర్వహించారు. అనంతరం జగన్మోహనరెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని దోషిగా చూపకుండా పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదంటూ విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వైసీీప ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు, తప్పు కేంద్రానికి కాదు, మనం అడగకుండా ఉండటంలోనే తప్పు ఉంది అన్నారు పవన్ కళ్యాణ్. నా సినిమాలు ఆపేస్తే నా ఆర్ధిక మూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారనీ, వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఏపిలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ సర్కార్ ను పవన్ విమర్శించడం ఆలస్యం వైసీపీ నుండి వెంటనే ప్రతి విమర్శకు సిద్ధమైయ్యారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.
బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలి
పవన్ ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినా వైసీపీ నుండి అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి పేర్ని నాని లేకపోతే అధికార ప్రతినిధి అంబటి స్పందిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పేర్ని నాని బిజీగా ఉన్నట్లున్నారు వెంటనే అంబటి దీనిపై స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఆయనకు ఓట్లు వేసి సీట్లు ఇవ్వలేదన్న ఏడుపు స్పష్టంగా కనబడుతోందని విమర్శించారు అంబటి. 151 సీట్లు, 151 సీట్లు అంటూ ప్రతి సారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. పోరాటం అంటే ఏమిటి, ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తూనే ఉన్నాం, కేంద్రానికి లేఖ రాశాం, అసెంబ్లీలో తీర్మానం చేశామని అని పేర్కొన్న అంబటి పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలపై గౌరవం ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమపై నిజమైన ప్రేమే ఉంటే మీ జనసేనను ప్లకార్డు పట్టుకుని బీజేపీ ఆఫీసు ముందు నిలబలమనండి అని అన్నారు.
సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదు
“ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్రంతో అంటకాగుతోంది నువ్వు, సీట్ల పంపకాలు చేసుకుంటోంది నువ్వు. అంత సఖ్యతగా ఉంటున్న నువ్వు విశాఖ ఉక్కు గురించి కేంద్రంతో మాట్లాడలేకపోతున్నావే.. ఏమిటి గుట్టు” అని అంబటి ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. పవన్ సినిమాలను అడ్డుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు అంబటి. సినీ ప్రేక్షకులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకువచ్చిందనీ, దీన్ని సినీ పెద్దలు స్వాగతించారన్నారు. పవన్ కు నిజాయితీ ఉంటే ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు. ఎంత చూపుతున్నారు అని అంబటి ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి మంచి చేస్తే పవన్ ప్రశంసించలేదు. చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేదని అన్నారు.