Pawan Kalyan Vs Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన సున్నితమైన స్ట్రాటజీ నడుస్తోంది. అది ఏమిటంటే కులాల స్ట్రాటజీ. కుల రాజకీయానికి సంబంధించిన స్ట్రాటజీ. 2024 ఎన్నికలే లక్ష్యంగా కులాల్లో అంతర్గతంగా కదుపుతున్న పావులు ఏమిటి అంటే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీని మొదలు పెట్టారు. టీడీపీ దీన్ని అందుకుంటోంది. వైసీపీ కూడా అంతర్గతంగా మొదలు పెట్టే పనిలో ఉంది. వైసీపీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడచిన పది రోజులుగా తన ప్రసంగంలో వ్యూహాన్ని మార్చారు. ఇది అందరికీ అవగతం అవుతూనే ఉంది. సామాజిక సమీకరణాలను తెరమీదకు తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ అంటూ కాపు సామాజిక వర్గాన్ని ఐక్యం చేసే పనిలో నిమగ్నమైయ్యారు. కాపులు అంతా ఐక్యంగా ఉండి జగన్మోహనరెడ్డికి, వైసీపీ వ్యతిరేకంగా నిలబడాలనే అంతరార్ధంతో ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. తొలి సారిగా పవన్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీ తీసుకువచ్చారు. వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ తాను ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు అన్ని కులాలు ఒక్కటే చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా చెబుతూనే కాపు సామాజిక వర్గం ఐక్యం కావాల్సిన ఆవస్యకతను వివరిస్తున్నారు.
Pawan Kalyan Vs Ys Jagan: వైసీపీ నుండి కాపులను దూరం చేసే పనిలో పవన్, వంగవీటి రాధ
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు అండగా నిలబడింది బీసీలు, కాపులు. ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం మొదటి నుండి వైసీపీకి ఓటు బ్యాంకే. బీసీలు, కాపులు 2019 ఎన్నికల్లో వైసీపీకి టర్న్ కావడం వల్లనే జగన్మోహనరెడ్డికి అన్ని ఓట్లు, అన్ని సీట్లు వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి కాపును దూరం చేసే పనిలో పవన్ కళ్యాణ్, బీసీలను దూరం చేసే పనిలో టీడీపీ ఉంది. టీడీపీ కూడా వైసీపీ నుండి కాపులను దూరం చేసే పనిలో ఉంది. వంగవీటి రాధా కృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా స్ట్రాటజీగా మాట్లాడుతున్నారు. కాపులంతా ఐక్యంగా ఉంటే ఏ ప్రభుత్వాన్ని అయినా కూల్చే సత్తా ఉంటుంది అంటూ మాట్లాడారు వంగవీటి రాధా కృష్ణ. ఇటు పవన్ కళ్యాణ్, అటు వంగవీటి రాధాకృష్ణ ఇద్దరూ కాపు సామాజికవర్గ నేతలే. కాపులు అందరూ ఐక్యంగా ఉండాలి. కాపులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాలి అంటూ బయటకు చెప్పేస్తున్నారు. వీరి ఇద్దరి వ్యూహాలను అర్ధం చేసుకున్న వైసీపీ సైలెంట్ గా ఎందుకు ఉంటుంది. కాపు సామాజిక వర్గ నేతలు కేవలం జనసేన, టీడీపీలోనే కాదు వైసీపీలోనూ ఉన్నారు. జనసేన, టీడీపీ ఎంత స్ట్రాటజీగా వస్తున్నారో తెలుసుకున్న వైసీపీ కూడా అంతర్గతంగా చర్చలు మొదలు పెట్టింది. వైసీపీలోని కాపు సామాజికవర్గ నేతలు అందరూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో నలుగురు కాపు నేతలు మంత్రి పదవులు ఉన్నాయి. ఆళ్ల నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు కాపులకు నాలుగు మంత్రి పదవులు ఉండగా త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో అయిదు లేదా ఆరు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు జిల్లాల వారిగా బాధ్యతలు అప్పగించే యోచన వైసీపీ చేస్తుంది. ఇప్పటి వరకూ జిల్లాల పార్టీ బాధ్యతలు అన్నీ రెడ్డి సామాజిక వర్గం నేతలే చూస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇలా రెడ్డి సామాజిక వర్గ నేతలే మూడు నాలుగు జిల్లాల పార్టీ బాధ్యతలను ఇప్పటి వరకూ చూస్తున్నారు.
జనసేన, టీడీపీ స్టాటజీకి ధీటుగా వైసీపీ వ్యూహం
ఇకపై కాపు నేతలకు కీలక మంత్రిపదవులు ఇస్తూనే పార్టీ పరంగానూ కీలకమైన బాద్యతలు అప్పగిస్తే కాపులను వైసీపీ నుండి బయటకు వెళ్లకుండా చూసుకోగలం అని భావిస్తుందట. 2019 కాపు సామాజిక వర్గ మద్దతు ఎలా ఉందో రాబోయే ఎన్నికల్లోనూ అదే మాదిరిగా ఉండే విధంగా చూసుకోగమని వైసీపీ లోని కాపు నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారుట. ఈ స్ట్రాటజీని జగన్మోహనరెడ్డి ద్వారా బయటకు తీసుకువచ్చే పనిలో వారు ఉన్నారు. రానున్న రెండు నెలల్లో ఈ స్ట్రాటజీని అమలు చేయనున్నారు. ఈ విషయంలో జగన్మోహనరెడ్డి ప్రశాంత్ కిషోర్ (పీకే) సలహా తీసుకుని ముందుకు వెళ్లనున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు 2019 ఎన్నికల్లో ఒక స్ట్రాటజీ ప్రకారం తునిలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహనరెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వం, అవన్నీ అయ్యేపని కావు అని చెప్పేశారు. అప్పుడు ఆ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో భాగంగా ప్రత్యర్థులు ఏదైతే సామాజిక సమీకరణాలను బయటకు తీస్తున్నారో అదే సామాజిక సమీకరణలతో అదే స్ట్రాటజీతో వైసీపీ తనకు అనుకూలంగా ఉన్న కాపులను బయటకు వెళ్లకుండా చేసే పనిలో జగన్మోహనరెడ్డి ఉన్నారు. కొంత మంది కాపు నేతలు జగన్మోహనరెడ్డికి అండగా ఉండేందుకు సిద్ధం అవుతున్నారు. కానీ కొన్ని బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పదవులు ఎక్కువ ఇవ్వాలి,. పార్టీలో బాధ్యతలు ఇవ్వాలి. అంతర్గతంగా ఆర్ధిక ఇతర అంశాలను సరి చూడాలి. ఇవన్నీ ఓకే అనుకుంటే వైసీపీలోనూ ఒక స్ట్రాటజీ మొదలు అవుతుంది.