Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై స్పందించారు. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనలో జనసేనతో పొత్తుపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన కామెంట్స్ పై నిన్నటి వరకూ జనసేన నుండి స్పందన రాలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం జనసేన – టీడీపీ పొత్తుతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ మాత్రం మొదటి నుండి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే గాటికి కట్టేసినట్లుగానే విమర్శలు చేస్తోంది. అయితే పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారిగా స్పందించారు. పార్టీ కార్యనిర్వహక సభ్యుల టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Pawan Kalyan: సంస్థాగత నిర్మాణంపై దృష్టి
పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిద్ధామని అన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏమి మాట్లాడినా..మైండ్ గేమ్ లు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని నిర్దేశించారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లననీ, పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకూ ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని అన్నారు.
మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ
రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాలకు గానూ ఇప్పటి వరకూ 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నామని పేర్కొన్న పవన్.. ఈ ఏడాదిలోపే సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను పూర్తి చేసుకుందామని తెలిపారు. గత సంవత్సరం కరోనా కారణంగా పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోలేదన, ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇందు కోసం అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కమిటీ దిశా నిర్దేశం మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని ఆ సభలో 2024 ఎన్నికలకు కావాల్సిన ఆలోచనలు చేయనున్నట్లు పవన్ చెప్పారు. సంక్రాంతి తరువాత మరో సారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు పవన్ తెలిపారు.