TDP Janasena: ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతల్లో గుబులు నెలకొంది. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతుండటం దీనికి ప్రధాన కారణం. ఈ నియోజకవర్గానికి ఒక రాజకీయ ప్రత్యేకత ఉంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తే .. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అందుకే రాజకీయ పార్టీలు రాజంపేట స్థానం కోసం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తుంది. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో పొత్తులో భాగంగా జనసేన అడుగుతున్నట్లు సమాచారం.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి ఈ నియోజకవర్గంలో దాదాపు 15 శాతంపైగా ఓట్లు వచ్చాయి. పీఆర్పీ అభ్యర్ధికి 21,499 ఓట్లు రావడంతో త్రిముఖ పోరులో 12,342 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన మేడా వెంకట మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఆయన రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. రాబోయే ఎన్నికలకు టీడీపీ గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తొంది. అయితే టీడీపీ టికెట్ కోసం నియోజకవర్గ ఇన్ చార్జి బత్యాల చెంగల్ రాయుడు తో పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రాజు, గంటా నరహరి ప్రయత్నిస్తున్నారు. ఇలా నలుగురు టికెట్ రేస్ లో ఉండటంతో టీడీపీ ఇంత వరకూ ఎవరినీ ఫైనల్ చేయలేదు.
కాపు (బలిజ) సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటంతో ఈ సీటును జనసేనకు కేటాయించాలనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ జనసేనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నా సరైన నాయకత్వం లేదనే టాక్ ఉంది. రాజంపేట నుండి జనసేన తరపున పోటీ చేసేందుకు సిద్దమైన మాజీ డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి, పారిశ్రామిక వేత్త యల్లటూరి శ్రీనివాసరాజు రీసెంట్ గా పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన గత కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జనసేన అభిమానులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీనివాసరాజు. తాజాగా ఆయన అధికారికంగా జనసేన పార్టీలో చేరడంతో జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తుందేమో అన్న ఆందోళన టీడీపీ అశావహుల్లో నెలకొంది. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధి అయితే 2014 ఫలితమే రిపీట్ అవుతుందన్న వాదన ఉంది. దీంతో రెండు పార్టీల నుండి ఆశావహులు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీనివాసరాజు పోటీ చేస్తే ఓ పక్క పార్టీ ఓటింగ్ కు తోడు క్షత్రియ సామాజిక వర్గ ఓటింగ్ కలిసి వస్తుందని అనుకుంటున్నారు. కీలక నేత జనసేనలో చేరిన నేపథ్యంలో టీడీపీ ఈ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Indrakeeladri: బెజవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన