ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ సేవలకు దూరమయ్యారు. దీంతో కీలకమైన పింఛన్ల పంపిణీ వ్యవహారం.. రాజకీయ దుమారం రేపింది. వలంటీర్లు ఆగిపోవడానికి.. చంద్రబాబు చేసిన పని కారణమని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. దీనిని తొలి రెండు రోజులు మెజారిటీ ప్రజలు నమ్మారు. ప్రతి నెలా 1వ తేదీనే తమ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ పింఛన్లు పంపిణీ చేసిన వలంటీర్లను చంద్రబాబు ఆపించడమేంటని.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులు లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు.
దీనికి కారణం చంద్రబాబు, ఆయన పరివారం చేసిన కుట్రలేనని ప్రజలు చర్చించుకున్నారు. మొత్తానికి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక, అప్పటి నుంచి ఈ చర్చ యూటర్న్ తీసుకుంది. పింఛన్ల పంపిణీ గంటల కొద్దీ ఆలస్యం కావడం.. నిధులు కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది లబ్ధి దారులు గంటల కొద్దీ వేచి.. చూసి సొమ్మసిల్లిన సందర్భాలు కూడా కనిపించాయి. ఇది అంతిమంగా జగన్ మెడకు చుట్టుకుంది.
చంద్రబాబు వలంటీర్లను ఆపేశారు. బాగానే ఉంది. మరి సచివాలయాలకు వచ్చిన మాకు పింఛన్లు సక్రమంగా ఇవ్వాలి కదా..? ఇది చంద్రబాబు తప్పు కాదు కదా! జగనే ఉద్దేశ పూర్వకంగా నిధులు ఇవ్వ కుండా.. గంటల కొద్దీ మమ్మల్ని కూర్చోబెట్టారు. కనీసం కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. టెంట్లు వేస్తామని చెప్పారు. నీళ్లు ఇస్తామన్నారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. ఇది చంద్రబాబు తప్పు కాదు కదా!` అని మెజారిటీ పింఛను దారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, విజయనగరం, శ్రీకాకుళం వంటి ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలలో అయితే.. బుధవారం రాత్రి 8 గంటల వరకు కూడా పింఛను దారులు అక్కడే ఉన్నా.. వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఈ పరిణామం జగన్ కు చుట్టుకుంది. జగన్ కావాలనే ఇలా చేస్తున్నారంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆరోపించారు. తమపై ప్రేమ ఉంటే.. డబ్బులు రెడీ చేసుకుని.. ఉండాల్సింది. కానీ, ఆయన డబ్బులు లేకుండా మమ్మల్ని పిలిచి ఘోష పెడుతున్నారంటూ.. చాలా మంది వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. వలంటీర్లను ఆపారన్న ఆవేదన కంటే కూడా.. సచివాలయాలకు వచ్చినా.. పింఛన్లు ఇవ్వలేదన్న ఆవేదన.. పింఛను దారుల్లో కనిపించడం గమనార్హం.