RK Roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. సినీరంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆర్కె రోజా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత రాజకీయ అరంగ్రేటం టీడీపీ ద్వారా చేసినా చంద్రబాబు నాయుడు ఆమెను పార్టీ ప్రచారాలకు ఉపయోగించుకున్నారే కానీ చట్టసభలకు అవకాశం ఇవ్వలేదు. రాజకీయాల్లోకి వచ్చినా అటు సినిమాలు, ఇటు టీవీ షోలు చేస్తున్నారు ఆర్కే రోజా, తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో లో న్యాయ నిర్ణేతగా పాల్గొంటూనే ఉన్నారు. అయితే జగన్మోహనరెడ్డి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆర్ కే రోజా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై సినిమా షూటింగ్ లలో, టీవీ షోలలో పాల్గొననని వెల్లడించారు ఆర్ కే రోజా.
Read More: CM YS Jagan: సామాజిక సమతుల్యం .. జగన్ మైండ్ వర్క్ సూపర్..!!
RK Roja: ప్రదక్షిణలు ఫలించాయి
ఆర్కే రోజాకు జగన్ తొలి సారి మంత్రివర్గంలోనే స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించిన నాయకుల్లో రోజా ముందు వరుసలో ఉన్నారు. గత అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఘాటుగా విమర్శించినందుకు సభ నుండి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు రోజా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రేజ్, పార్టీకి అంకిత భావంతో పని చేసినందున తొలి దఫాలోనే ఆమెకు మంత్రి పదవి వరిస్తుందని అటు పార్టీ వర్గాలు అనుకున్నాయి. ఆమె కూడా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ అవకాశం లభించకపోవడంతో అలిగారు. ఆ తరువాత ఆమెకు జగన్ ఏపిఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. ఈ సారి కూడా మంత్రి పదవి వరిస్తుందో లేదో అన్న ఊగిసలాట కొనసాగింది. దీంతో ఆమె భగవంతుడిపై భారం వేసి తిరుపతి వెంకన్నను మొదలు కొని వరుసగా పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎట్టకేలకు సీఎం జగన్ మనసు గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లా నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండటంతో కులాల ఈక్వేషన్ లో ఆమెకు స్థానం దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించడంతో రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం లభించింది.