Sajjala Rama Krishna Reddy: అబద్దాలు, వంచన, డ్రామా చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృందం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి రావడంపై ఆయన స్పందిస్తూ బాబు ఢిల్లీకి వెళ్లడం పచ్చ మీడియా పెద్ద వార్తగా ప్రచారం చేసోందనీ, కానీ బాబు బూతు పంచాగం డ్రామా ఫెయిల్ అయ్యిందని సెటైర్ వేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన దృష్టి మరల్చేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందనీ, ఈ క్రమంలోనే పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ టూర్ పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపారని అన్నారు. డ్రగ్స్ పేరుతో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు.
Sajjala Rama Krishna Reddy: ఏపికి నష్టం కల్గించేవిగా చంద్రబాబు వ్యాఖ్యలు
చంద్రబాబు చర్యలు ఏపికి తీవ్ర నష్టం కలిగే విధంగా ఉన్నాయని సజ్జల అన్నారు. తనకు ఓటు వేయని ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో ఏపి పరువు తీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా కు ఫిర్యాదు చేస్తే ఆయన రాష్ట్రం మీద ఏం చర్యలు తీసుకుంటారని సజ్జల ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే ఏమవుతోందో చంద్రబాబు తెలీదా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి చక్రం కాదు కదా దీపావళి చక్రం కూడా చంద్రబాబు తిప్పలేదని, కిక్కురుమనకుండా ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఇంటికి చంద్రబాబు తిరిగి వచ్చారని అన్నారు. ఈ వారం రోజులుగా చంద్రబాబు నడిపిన డ్రామా వల్ల మీడియాలో కొంత స్పేస్ ను చంద్రబాబు ఆక్రమించి ఉండొచ్చు కానీ దీని వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోందనేది అందరూ గమనించాలన్నారు.
అమిత్ షా ఫోన్ చేశారంటూ కలరింగ్
సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు ఏపి డ్రగ్స్ రాజధాని గా ఉన్నదని ప్రకటన ఇవ్వడం అంటే ఏ సెక్షన్ కింద ఎంత కఠినాతికఠినమైన శిక్ష వేసినా తప్పులేదనిపిస్తోందని సజ్జల అన్నారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. నాలుగైదు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రాష్ట్రం ఇమేజి దెబ్బతీయటం మించిన ఉగ్రవాదం ఇంకొకటి లేదని అన్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎల్లో మీడియా అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు అన్నట్లు కలరింగ్ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు ఏ అమిత్ షా మాట్లాడారో తెలియదు, ఆయన ఫోన్ చేసినా చేయకపోయినా అబద్దం రాయటంలో చంద్రబాబుకు శక్తియుక్తులు ఉన్నాయన్నారు. ఎయడెడ్ స్కూళ్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు.