AP Employees: ‘పీఆర్సీ’పై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగ సంఘాలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. వాద, ప్రతివాదనలతో సమస్యను పెంచుకుంటున్నారు తప్పితే.. పరిష్కార మార్గాలు చూడటం లేదు. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే.. పీఆర్సీ జీవో రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మీరు వస్తేనే కదా సమస్యలు చర్చించి పరిష్కరించేది..? అని ప్రభుత్వం అంటోంది. మొత్తంగా ఇద్దరి మధ్యా ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసినా చర్చలకు రావడంలేదు ఉద్యోగులు. మరోవైపు.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. ఇప్పటికే నిరసనలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
చర్చలకు రావాలి కదా..
‘ఉద్యోగ సంఘాలను మూడు సార్లు చర్చలకు పిలిచాం. వస్తారని ఎదురు చూస్తున్నా వారు రావడం లేదు. కమిటీకి అధికారం లేదన్నారని.. అధికారికంగా జీవో ఇచ్చి పిలిచినా రాకపోవడం ఏంటి? ఎక్కడో కూర్చుని డిమాండ్స్ చేస్తే కాదు.. మెట్టు దిగితేనే సమస్య పరిష్కారం అవుతుంది. జేఏసీలోని సంఘాలే కాకుండా ఇతర సంఘాలు వచ్చినా మాట్లాడతాం. ఇమ్మెచ్యూరిటీతో ఆలోచిస్తున్న నాయకులకు ఉద్యోగులు చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చేయడం విరుద్ధం. సమస్య జఠిలం కాకుండా పరిష్కరించుకోవాలి. హెచ్ఆర్ఏ తగ్గిందో లేదో ఉద్యోగుల వచ్చి మాతో మాట్లాడాలి. మీడియాలో మాట్లాడితే ఎలా..? పిఆర్సీకి అంగీకరించి ఇపుడు సమ్మెకు వెళ్లడం ఏంటో ఉద్యోగ సంఘాలు ఆలోచించుకోవాలి. ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయి’ అని అన్నారు.
మీరు సాక్ష్యం కాదా..
దీనికి ఉద్యోగ సంఘాలు.. ‘పీఆర్సీకి ఎప్పుడు అంగీకరించామో సజ్జల చెప్పాలి. అశుతోష్ నివేదికపై చర్చిద్దామని సజ్జల చెప్పలేదా..? పీఆర్సీపై జీవోకు సజ్జల సాక్షి కాదా..? ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీతోనే చెప్తున్నామా..? ఇంకెన్ని సంఘాలను చీల్చుతారు..? కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వానికి ఎందుకు ఉత్సాహం..? పీఆర్సీతో నష్టమని సీఎస్, మంత్రుల కమిటీకి విన్నవించినా పట్టించుకోలేదు. అశుతోశ్ కమిటీ నివేదిక బయటపెడితే, పాత జీతాలు ఇస్తే, జీవో వెనక్కి తీసుకుంటే చర్చలకు వస్తామని రోజూ సచివాలయానికి ఓ బృందాన్ని పంపిస్తున్నా.. రావట్లేదంటారా..?’ అని ధీటుగా స్పందించాయి. దీంతో.. ఇద్దరి మధ్యా గ్యాప్ పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. మరోవైపు.. సమ్మె సమయం దగ్గరపడుతోంది. మరి.. సమస్యకు పరిష్కారమెప్పుడో.. ఎలానో..!?