TDP Bandh:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు నిచ్చింది. టీడీపీ బంద్ కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా తదితర పక్షాలు సంఘీభావం ప్రకటించాయి.
బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, ఇన్ చార్జిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మరో పక్క జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు రోడ్డు పైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితర టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరసనలు, బంద్, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. ఆందోళనలు చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సందర్భంలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బస్సులను అడ్డుకున్నారు. దీంతో పరిటాల శ్రీరామ్ ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పరిటాల శ్రీరామ్ ను స్టేషన్ కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు స్టేషన్ వద్ద కు చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలానే మాజీ మంత్రి పరిటాల సునీత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టినా ఆమె తప్పించుకుని బయటకు వెళ్లి రామగిరి రోడ్డు లో టీీడీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.