తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరైన పాయింట్ లేవనెత్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2026 లో జన గణన అదారంగా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఉంటుందని తెలిపారు. 2026లో జనాభా లెక్కలు వచ్చి, రాజ్యాంగ సవరణ చేసి, పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలంటే 2031 వరకు ఆగాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు సోమిరెడ్డి. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరం అయ్యిందా అని ప్రశ్నించారు సోమిరెడ్డి. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామని వెంటనే నెరవేర్చాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
ఏపి, తెలంగాణకు చెందిన ఎంపిలు సభ్యులు పార్లమెంట్ లో సోమిరెడ్డి లేవనెత్తిన సందేహాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. విభజన చట్టంలో ఉన్న అనేక హామీలను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అందులో ప్రధానంగా ఏపికి ప్రత్యేక హోదా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. అదే విధంగా విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం పక్కన పెట్టేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రంపై ఏ విధంగా వత్తిడి తీసుకువస్తారో వేచి చూద్దాం.