రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపది ముర్మును మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీలు. గురువారం లోకే సభ ప్రారంభం అయిన వెంటనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణమే అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
అయితే ఇప్పటికీ అధీర్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. ఉభయ సభలు అధికార విపక్ష పోటీ పోటీ నినాదాలు హోరెత్తాయి. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలనీ బీజేపీ, పెరిగిన ధరలు, నిత్యావసరాలపై జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాలు నినాదాలు చేస్తూ గందరోగళం సృష్టించడంతో లోక్ సభ ను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, తర్వాత మధ్యాహ్నం 2 గంటలు వరకూ స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. రాజ్యసభను సాయంత్రం నాలుగు గంటల వరకూ చైర్మన్ వెంకయ్యనాయుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అంతకు ముందు రాజ్యసభ నుండి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అమ్ అద్మీ పార్టీ ఎంపీలు సుశీల్ కుమార్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ఎంపీలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో పార్లమెంట్ నుండి సస్పెండ్ అయిన వారి సంఖ్య 27కు చేరింది.