YSRCP: రాజకీయాల్లో కొందరు నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోయి తమ హావా కొనసాగిస్తుంటారు. అది కొందరికే సాధ్యమవుతుంటుంది. పార్టీలు మారి మంచి పదవులు సంపాదించి హవా చేస్తున్నవారు ఉంటారు. అయితే కొందరు నాయకుల నిలకడలేని మనస్థత్వం కారణంగా రెంటికీ చెడ్డ రేవడిగా అవుతుంటారు. ఉమ్మడి ఏపి రాష్ట్ర రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంచి పదవి ఆశించినా ఫలితం దక్కలేదు. అయితే ఆయనకు కుమారుడి పోటీకి రావడంతోనే ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది.
విషయంలోకి వస్తే..విశాఖ జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు టీడీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఎమ్మెల్సీ పదవి విషయంలో అన్యాయం జరగడంతో టీడీపీకి దూరం అయ్యారు. 2013లో దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి అవ్వగా మరో సారి అవకాశం కల్పించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. చంద్రబాబు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసి తన కుమారుడు రత్నాకర్ తో కలిసి వైసీపీలో చేరారు. 2014లో ఎన్నికల్లో దాడి కుమారుడు రత్నాకర్ కు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు. వైసీపీ నుండి పోటీ చేసిన రత్నాకర్ నాటి ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. అనంతరం దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
మరల మళ్లీ 2019 ఎన్నికలకు ముందు తండ్రీ తనయులు వైసీపీకి గూటికి చేరారు. అయితే జగన్ వీరికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశించిన ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో వీరభద్రరావు పార్టీ అలిగారని వార్తలు వచ్చాయి. వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండగా ఆయన కుమారుడు రత్నాకర్ ఏదైనా నామినేటెడ్ పదవి అశించారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దాడి వీరభద్రరావు సేవలను పార్టీ కోసం వాడుకోవాలని యోచించి ఆయన తనయుడు రత్నాకర్ కు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కుమారుడికి పదవి లభించడంతో వీరభద్రరావుకు ఇక ఎమ్మెల్సీ అవకాశం లేకుండా పోయిందని అనుకుంటున్నారు. కుమారుడుకి పదవి వచ్చిందని ఆనందపడాలో, తనకు మంచి పదవి వచ్చే అవకాశం ఇక లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో దాడి వీరభద్రరావు ఉన్నారు.