హైకోర్టుకు సమాచారం పంపిన ఏసీబీ..ఆస్పత్రి
చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించేందుకు వినతి
ఈఎస్ఐ కుంభకోణం లో ఏసీబీ అరెస్ట్ చేసి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి..టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కింజరపు అచ్చెన్నాయుడకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖా మంత్రిగా పని చేసన సమయం లో ఈఎస్ఐ మందుల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడటంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసారు. జూన్ 12న ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని..అరెస్ట్ చూపించారు. అప్పటికే అచ్చెన్న చిన్నపాటి సర్జరీ చేయించుకొని ఉన్నారు. దీంతో..కోర్టులో హాజరు పర్చగా..ఆయనను గుంటూరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అయితే, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రయివేటు ఆస్పత్రిలో సొంత ఖర్చుతో చికిత్సకు అనుమతించాలని హైకోర్టును అభ్యర్దించగా అందుకు అనుమతించారు. దీంతో…ప్రస్తుతం అచ్చెన్న గుంటూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బెయిల్ కోసం ఏసీబీ కోర్టుకు..అక్కడ రిజెక్ట్ కావటంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ రాకపోవటంతో ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలోనే పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
బెయిల్ కోసం ప్రయత్నాలు…
అచ్చెన్నాయుడు గతంలో జరిగిన సర్జరీ కారణంగా వచ్చిన ఇన్ ఫెక్షన్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ప్రయివేటు ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే, నాలుగైదు రోజులు గా అస్వస్థకు గురి కావటంతో ఆయనకు వైద్యులు కరోనా పరీక్ష చేయించారు. అందులో అచ్చెన్నకు కరోనా పాజిటివ్ గా తేల్చారు. వైద్యులు పోలీసు అధికారులకు విషయాన్ని చేరవేయటంతో..వారు అచ్చెన్నాయు డు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎంపీ రామ్మోహన్ నాయుడు వైద్యులతో మాట్లాడి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసారు. ప్రస్తుతం అచ్చెన్న ఉన్న ఆస్పత్రిలో కరోనాకు చికిత్స లేకపోవటంతో మరో ప్రయివేటు ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. ఇందు కోసం కోర్టులో ప్రత్యేకంగా పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ఇదే సమయంలో అచ్చెన్నకు హైదరాబాద్ కు తీసుకెళ్లి కరోనా ట్రీట్ మెంట్ ఇప్పించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకు అనుమతి తీసుకొనేందుకు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.