మానవ సంబంధాలకు అర్థం మారిపోతోంది. అవసరానికి వాడుకోవడం వదిలేయడం కార్పొరేట్ స్టైల్ అంటూ ఇన్నాళ్లూ చెప్పుకుండూ పోతున్నాం. కానీ ఇప్పుడు మనుషుల్లోని కోరికలు కొత్త నిర్వచనాలిస్తున్నాయ్.
వావి వరసుల్లేకుండా ఇష్టానుసారం దొంగచాటుగా సాగుతున్న వ్యవహారాలు కొన్నైతే… మరికొన్ని విశృంఖల సంబంధాలకు దారితీస్తున్నాయ్. పెద్ద పెద్ద సిటీల్లో ఎఫైర్లు, లవ్లకు కొదువ ఉండదు. కానీ సంబంధాల్లో లోతులు మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంటాయ్.
హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన ఎవరినైనా షాక్కు గురి చేస్తోంది. తన భార్య తనకే సొంతం అనుకున్నాడో యువకుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనతో జీవితాంతం తోడుండాలని కోరుకున్నాడు. కానీ ఆమె మరికొందరితో సన్నిహితంగా మెలగడంతో కంగుతున్నాడు. వద్దు… ఇది తప్పు అంటూ చెప్పిచూశాడు. ఎంతకీ వినకపోవడంతో గొంతు కొసి కడతేర్చాడు.
అసలు ట్విస్టేంటంటే… సదరు వ్యక్తి… తాను పెళ్లి చేసుకున్న భార్యకు తొమ్మిదో భర్త. హైదరాబాద్లో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వరలక్ష్మి అనే మహిళ కర్నూలుకు చెందిన క్యాబ్ డ్రైవర్ నాగరాజును వివాహం చేసుకొంది.
అంతకు ముందే ఆమెకు భర్త, కుమారుడు కూడా ఉన్నా… నాగరాజుతో ప్రేమ కోసం తన భర్తను, కుమారుడిని వదిలేసి పెళ్లి చేసుకొంది. తన కోసం ఇంతటి త్యాగమా… జన్మధన్యమైపోయిందనుకున్నాడు నాగరాజు. కొన్నాళ్లు ఇద్దరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఇటీవల వరలక్ష్మీ మరికొందరు వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు మొదలయ్యాయ్. ఇలా చేయోద్దంటూ గట్టిగా హెచ్చరించాడు.
అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గొంతు కోసి హత్య చేశాడు. నేరుగా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే కేసు విచారించిన పోలీసులకు మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. వరలక్ష్మి, నాగరాజును పెళ్లి చేసుకోక ముందు… ఎనిమిది మందిని వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించారు. నాగరాజు విషయంలో ఏం జరిగిందో… మిగతా వారి విషయంలో కూడా అలాగే జరిగిందని స్థానిక పోలీసులు చెప్పారు.
వరలక్ష్మీ, నాగరాజు వ్యవహారం సిటీల్లో జరుగుతున్న విశృంఖల సంబంధాలకు ఒక తార్కాణం. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… కోరికల కోసం… విచ్చలవిడిగా మారుతున్న యువత పెడధోరణులకు అర్థం పడుతోంది. కేవలం కోరికలే జీవితమనుకుంటే… ఇక అలాంటి జీవితాలకు ఇలాంటి ఫుల్ స్టాప్ లు తప్పదు. అది భార్య అయినా… భర్త అయినా… హద్దు మీరితే కాటు తప్పదు.