Modi Govt: దేశంలోని అధికార పక్షం ఎంత నిసిగ్గుగా అబద్దం చెప్పింది అనడానికి ఇది ఓ పెద్ద ఉదాహారణ. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత దేశంలో ఎంత సంక్షోభాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. పలు రాష్ట్రాల్లో వైద్యం అందక, ఆక్సిజన్ లభించక మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం ఆక్సిజన్ అందక దేశంలో ఒక్కరూ కూడా మరణించలేదని సగర్వంగా చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చే సరికి రాష్ట్రాల నుండి తమకు అందిన సమాచారం ఇచ్చామని తప్పుకుంది. ఇంత వరకూ ఇది బాగానే ఉంది. ఇక పోతే ..అసలు విషయానికి వద్దాం..
ఆక్సిజన్ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని నియమించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రోమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర నేతృత్వంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ శాఖలకు చెందిన 9 మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. తరువాత సెప్టెంబర్ నెలలో ఇదే కమిటీనే ఎంపవర్డ్ గ్రూపుగా మార్చారు. దానికి కూడా మహాపాత్రే నేతృత్వం వహించారు. అప్పట్లో ఈ విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన ద్వారా కూడా తెలియజేసింది.
ఆక్సిజన్ సరఫరా, పంపిణీ తదితర విషయాల పర్యవేక్షణకు కేంద్రం గొప్పగా కమిటీ వేసింది కదా, ఇంతకూ ఆ కమిటీ ఎన్ని సమావేశాలు నిర్వహించింది, ఏమి నిర్ణయాలు తీసుకున్నది అనే విషయాలను తెలుసుకోవాలని ఓ ఆర్టీఐ కార్యకర్త ఉత్సాహపడ్డాడు. కానీ ఆయనకు నిరుత్సాహం ఎదురైంది. అదెలా అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సౌరవ్ దాస్ అనే ఆర్టీఐ కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సమాచార హక్కు చట్టం కింద ఈ కమిటీ నిర్వహించిన సమావేశాలు, చర్చించిన విషయాలు తెలియజేయాలని కోరుతూ ఆ శాఖకు అర్జీ పెట్టుకున్నారు. దీనికి ఆ శాఖ సమాచారం అందించడం కుదరదు అని సమాధానం ఇచ్చింది. దేశ భద్రత, దేశ ఆర్ధిక వైజ్ఞానిక ప్రయోజనాల రీత్యా ఈ సమాచారం వెల్లడికి మినహాయింపు ఉందని ఆ సమాధానంలో పేర్కొంది. ఇది కెబినెట్ సమాచారం కిందకూ వస్తుందని, ఆ రకంగా కూడా మినహాయింపు ఉంటుందని చెప్పారు. దీంతో సౌరవ్ దాస్ పట్టువదలని విక్రమార్కుడిలా కేంద్ర సమాచార కమిషన్ కూ అప్పీల్ చేశారు. దీనిపై సమాచార కమిషన్ విచారణ జరిపింది. ప్రభుత్వ శాఖల అధికారులకు కమిషన్ ముందు హజరై సమాచారం ఇవ్వడం కుదరదు అని వాదించారు. అయితే సమాచార కమిషన్ వారి వాదనలతో ఏకీభవించలేదు. సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది.
ఒక వారం తరువాత ఏమి జరిగిందో ఏమో కానీ.. అసలు అలాంటి కమిటీనే లేదని కేంద్రం చెప్పింది. కమిటీనే లేదు కాబట్టి సౌరవ్ దాస్ అడిగిన సమాచారం ఇవ్వడం అనే ప్రశ్న తలెత్తదని ఆ శాఖ అధికారి తాజా సమాధానంలో చెప్పారు. అయితే అసలు మనుగడలో లేని కమిటీకి సంబంధించి సమావేశాల వివరాలు ఇవ్వడం కుదరదు అని ఆ శాఖ అధికారులు సమాచార కమిషన్ ముందు గట్టిగా ఎలా వాదించింది అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నం అవుతుంది కదా. దానికి ఆ శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు అనుకోండి. అది ఏమిటంటే.. సమాచారం కోరుతూ సౌరవ్ దాసు దాఖలు చేసిన అర్జీని చదువుకోవడంలో తమ అధికారులు పొరబాటు పడ్డారనీ, తెలియక చేసిన ఈ తప్పుకు చింతిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదంతా తెలుసుకుంటే కేంద్రం పచ్చి అబద్దం చెప్పినట్లు అనిపిస్తుందా లేక ఆర్టీఐ కార్యకర్త చెవిలో పెద్ద పువ్వు పెట్టింది అనుకోవాలా మీరే గెస్ చేయండి.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇప్పుడు ఆ కమిటీనే లేదని చెబుతున్న దానికి నేతృత్వం వహించిన డాక్టర్ గురప్రసాద్ మహాపాత్ర మాత్రం కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్ 19న మృతి చెందారు. ఈ కమిటీ విషయాల గురించి తెలుసుకునేందుకు గానూ ఆయన వద్దకు వెళ్లి అడిగే సాహాసం ఎవరూ చేయరు కదా !.