గత నెల రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లో అధికారపక్షం ఎంత బలంగా ఉన్నా దానికి తగ్గట్టు ప్రతిపక్షం గళం విప్పితేనే ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా… బాగుంటుంది, ప్రజలకు అన్ని రకాలా మేలు జరుగుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేకపోవడం. తెలంగాణలోను…. ఆంధ్రప్రదేశ్ లోనూ సంపూర్ణ మెజారిటీ తో కూడిన రెండు బలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. వాటికి అవతలివైపు అత్యంత బలహీనమైన ప్రతిపక్షాలు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విపక్షాలను పూర్తిగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 మందితో కాంగ్రెస్ విపక్ష పాత్రను పోషించి తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వారి స్థితిగతులను తెలుసుకుందాం.
మొదట తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడుతోంది. నిజానికి వారికి ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సిన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా హైకోర్టు ఆదేశాలతో ఆ పాత్రను ఇచ్చారు…. కానీ వారు దానిని సమర్థవంతంగా పోషిస్తున్నారా? కరోనా విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని మరియు పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీతో చేతులు కలుపుతున్నారు అని గోదావరి నదిపై ప్రాజెక్టు విషయంలో జాప్యం చేస్తున్నారని…. ఇలా అనేక ఆరోపణలతో వీధుల్లో చేరిన వారికి పెద్దగా ఆశించిన ఫలితం అయితే కనపడలేదు.
‘మీరు నాకు తోడుగా ఉండండి…. నేను తండ్రీకొడుకుల భరతం పడతాను’ అని తిరుగుతున్న రేవంత్ రెడ్డి కి ఫామ్ హౌస్ విషయంలో కనీస సహకారం కూడా లభించకపోవడం ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సిన విషయం. పిసిసి పదవుల కోసం రేవంత్ ను సైడ్ చేయడం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అప్పుడే మంతనాలు, రహస్య మీటింగ్ లు మొదలు పెట్టేశారు. ఇక రేవంత్ ఏదైనా ఫలితం ఆశించి చేస్తున్నాడా లేదా నిజంగానే పార్టీ కోసం మేలు చేస్తున్నాడా అన్న విషయం పక్కన పెడితే ఇక్కడ అందరూ తలా ఒక చేయి వేస్తే కానీ అత్యంత పటిష్టమైన టిఆర్ఎస్ పార్టీ పునాదులను కదల్చలేరు…. అప్పటికి కష్టమే. అయినా వారు కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడం ఇప్పుడు అసలైన చర్చకు దారితీస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులో పెట్టి న్యాయపోరాటం చేయించిన చంద్రబాబుకు ఇప్పుడు జగన్ నేరుగా షాక్ ల మీద షాక్ లు ఇవ్వటం మొదలు పెట్టాడు. చంద్రబాబు దొడ్డిదారిలో వ్యక్తులను పెట్టి కోర్టులో అసలు నాటక నడిపిస్తున్నాడని అర్థమైన జగన్ నేరుగా తాను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో బాబుకు చూపిస్తున్నాడు. పార్టీలోని ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు కానీ ఈ పరిస్థితిని చంద్రబాబు సమర్థంగా వాడుకున్నాడా అంటే అదీ లేదు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ పెద్ద అడ్డంకే అయినా బాబుకి ఉన్న అనుభవంతో ఆయన కొత్త దారులు వెతకాల్సింది. అయితే అతనికి పార్టీ నేతల నుండి ఎంత మాత్రం సహకారం లభిస్తుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే అందరూ దిక్కులు చూడాల్సిందే. ఇప్పటికే ముగ్గురు వైసీపీ పంచన చేరి పోయి టిడిపి లో ఉంటూనే చంద్రబాబు ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. ఇక ఇప్పుడు మిగిలిన నాయకుల్లో బాబు పట్ల విలువ ఏమి ఉంటుంది అన్నది ప్రజల ప్రశ్న.
ఇకపోతే బాబు గెలిచిన ఎమ్మెల్యేలను కాదని తన అంతరంగీకులకు కీలకమైన పదవులు ఇవ్వడం అంతేకాకుండా తమ నియోజకవర్గ పరిస్థితిని చర్చించి ప్రజలతో కలిసి పోయి కనీసం స్థానికంగా అయినా మైలేజీ పెంచుకునే పనులు చేసేందుకు ఏ నాయకుడినీ ప్రేరేపించకపోవడం అతి పెద్ద మైనస్ లుగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఏదైనా దూకుడుగా నిర్ణయం తీసుకుంటే దానిపై విమర్శించి మీడియా కి ఎక్కాలి లేదా తమ నేతలను అరెస్టు చేసినా…. తమపై అవినీతి ఆరోపణలు చేస్తే రోడ్డు పైకి వచ్చి రచ్చ చేయాలి. ఇవి రెండే…. తెలుగుదేశం పార్టీ అజెండాలుగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి.
టిఆర్ఎస్ పార్టీ పైన ఆధిపత్యం చెలాయించేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు తమ నేతలని నమ్మడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలపై పార్టీపై నమ్మకం లేని వారు చాలామంది బిజెపి, టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చే నెగటివిటీని ఏమీ పట్టించుకోకుండా కెసిఆర్ మరియు కేటీఆర్ రెండు చేతులు చాపి ఆహ్వానిస్తున్నారు. ముందు తమ పార్టీ నేతలను కాపాడుకుని వారిలో లో పూర్తిగా స్పూర్తిని నింపి భవిష్యత్తు పై భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ ముందున్న ఏకైక లక్ష్యం లేదా తెలుగు రాష్ట్రం నుండి త్వరలోనే పెట్టా బేడా సర్దుకుని వెళ్లి పోవాల్సి ఉంటుంది.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి పరిస్థితి కొంచెం బెటర్ అని చెప్పాలి. టిఆర్ఎస్ ఉన్నంత బలంగా వైసీపీ పార్టీ కనిపించడం లేదు. వారి నేతల్లో చాలామంది అసమ్మతి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. దాన్ని ఆసరాగా తీసుకొని తెలుగుదేశం పార్టీ త్వరగా ఏదైనా చేస్తే ఫలితం ఉంటుంది కానీ లేకపోతే ఆ పార్టీ భూస్థాపితం అయ్యేందుకు పెద్ద సమయం పట్టదు అని అంటున్నారు విశ్లేషకులు. కాబట్టి ఎవరి కిం కర్తవ్యం వారు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే రాజకీయాలు సమతూకంగా ఉంటాయన్నది రాజకీయవాదుల వాదన మరియు ఆశ కూడా.