Praveen Prakash: ప్రవీణ్ ప్రకాష్ గుర్తున్నారుగా… సీఎం జగన్ నీడగా.. సీఎం ఆఫీసులో స్టీరింగ్ తిప్పుతూ సర్వాధికారాలు చెలాయించేవారు..! మొన్నటి వరకు సీఎం ఆఫీస్ లో స్టీరింగ్ మొత్తం దగ్గర పెట్టుకుని ఇష్టానుసారం తిప్పి తోటి ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు, ఎమ్మెల్యేలకు సైతం చుక్కలు చూపించిన ప్రవీణ్ ప్రకాష్.., ఇప్పుడు ఆకస్మికంగా ప్రభావం కోల్పోయారు..! మొన్నటి వరకు ఆయన కనిపిస్తే వంగి, వంగి దండాలు పెట్టిన కీలక అధికారులు, సిబ్బంది కూడా ఇప్పుడు ఆయన్ను పట్టించుకోవడం లేదట.. దీనికి కారణం ఆయన వివాదాలే. సీఎం జగన్ అత్యంత నమ్మకంతో తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తే ఈయన అన్నిట్లో వేలు పెట్టి.. ఆ వేలు విరగ్గొట్టుకున్నారు.. ఇప్పుడు ఏపీలోని ఉన్నత స్థాయి.., కాస్త దిగువ స్థాయి అధికార, రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ…!
Praveen Prakash: దూకుడే బలం.. బలహీనత..!!
ప్రవీణ్ ప్రకాష్ మన రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఎక్కడో ఉత్తరాది నుండి వచ్చారు. కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండీ కలెక్టర్ గా.. వివిధ హోదాల్లో పని చేస్తూ వచ్చారు. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్శదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ని తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈయన స్థానంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శగా పనిచేస్తున్న ముత్యాలరాజును నియమించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారైన ప్రవీణ్ ప్రకాశ్ అంటే ఐఏఎస్ అధికారుల్లో గిట్టని వారు ఎక్కువగా ఉన్నారు. ఈయన దూకుడే ఆయనకు బలం, బలహీనతగా పేర్కొంటున్నారు. విశాఖపట్నం, టోరోగోదావరి, రంగారెడ్డి వంటి పెద్ద పెద్ద కీలక జిల్లాల్లో కలెక్టరుగా పని చేసిన ప్రవీణ్ ప్రకాష్ కి సమర్దుడిగా పేరుంది. వైఎస్ కి సన్నిహితుగా మారారు. ఈయన కోసం అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల సంఘంతో కూడా గొడవ పెట్టుకున్నారు. అందుకే ఆ అభిమానంతోనే ఇప్పుడు జగన్ కూడా తాను సీఎం గా బాధ్యతలు స్వీరించిన వెంటనే ప్రవీణ్ ప్రకాష్ కి కీలక బాధ్యతలు ఇచ్చారు. అలాగే తన జిల్లాకే చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్రెడ్డి, రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లం తదితరులను కూడా పెట్టుకున్నారు. మొదట్లో జగన్ ఆశించిన వేగంతో ధనుంజయరెడ్డి పనిచేయలేకపోవడంతో… ఆయన స్థానంలో ప్రవీణ్ ప్రకాష్ కి సర్వ బాధ్యతలు ఇచ్చారు.
ప్రవీణ్ ప్రకాష్ మొదటి నుండి ముఖస్తుతి, జగన్ చెప్పిన వెంటనే వెళ్లి వాలిపోవడం.., చెవిలో గుసగుసలు.., అతి భక్తి ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా బాగా చనువు, చొరవ ఇవ్వడంతో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అవినీతి తతంగాలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ ఊహించిన దాని కంటే కాస్త ఎక్కువైంది. దీంతో సమస్యలు ఎక్కువయ్యాయి. కొన్ని కీలక నిర్ణయాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలు తీసుకోకపోవడంతో పాటు కనీసం సీఎస్కు కూడా సమాచారం లేకుండా ప్రవీణ్ అత్యుత్సాహం ప్రదర్శించారట.. ఇదే సమయంలో ధనుంజయరెడ్డి భారతి ద్వారా పావులు కదిపి ప్రవీణ్ ప్రకాష్ అసలు స్వరూపాన్ని జగన్ కి తెలిసేలా చేశారని సమాచారం…!
ఈ నిర్ణయాలతో వివాదాలు..!!
ప్రవీణ్ ప్రకాష్ తీసుకుని కొన్ని నిర్ణయాలు జగన్ ప్రభుత్వానికి చికాకు తెప్పించాయి. సీఎం ను సైతం తప్పుదోవ పట్టించి.. వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల్ని, రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికశాఖకు మార్చే విషయంలో ప్రవీణ్ ప్రకాశ్ సొంత నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటూ అత్యంత వివాదాస్పదమైన గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శుల అధికారాల్లో కోత విధించి, వాటిలో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జీవో 2 జారీ చేయడం వివాదానికి దారి తీసింది. దీని వెనుక ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారంటూ అప్పట్లోనే ఊహాగానాలు వచ్చాయి. ఇటీవల ఈ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఓ వైపు వివాదాలు, మరోవైపు అవినీతి ఆరోపణలు.., మరోవైపు సొంత వారి సూచనలు.., సహచర ఐఏఎస్ ల ఫిర్యాదులు.. వెరసి ప్రవీణ్ ప్రకాష్ కోరలు పీకేలా చేశాయని సచివాలయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం..!!