మొన్నామధ్య తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఒ అల్పవర్గానికి చెందిన వ్యక్తికి శిరోమండనం చేశారు. ఆ జిల్లాలో పోలీసులు మూటగట్టుకున్న ఘనత అది. అది మర్చిపోకముందే ప్రకాశం జిల్లా చీరాలలో ఒ అల్ప వర్గానికి చెందిన యువకుడిని లాఠీలతో కొట్టి అతని మరణానికి కారణం అయ్యారు. ప్రకాశం జిల్లాలో పోలీసులు సాధించిన ఘనత అది. తాజాగా పోలీస్ స్టేషన్ లో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని, మందు పార్టీలు చేసుకుని మందేసి చిందేశారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు కట్టుకున్న ఘనత ఇది. నెల్లూరు జిల్లాలో మొన్నామధ్య ఒ వాలంటీర్ రోడ్డుపై తప్ప తాగి ఎస్ఐ ని తిడితే వాలంటీర్ పై కేసు పెట్టినందుకు ఆ ఎస్ఐ నే సస్పెండ్ చేసే వరకు వెళ్లారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు మూటగట్టుకున్న ఘనత అది. ఇలా చెప్పుకుంటూ వెళితే రాష్ట్రంలో పోలీసులు గత మెంతో ఘనం, ప్రస్తుతం సూన్యం అని చెప్పుకోవాల్సి వస్తోంది. పోలీసులంటే ఐదేళ్ల బాలుడి నుంచి వందేళ్ల ముసలాడి వరకు ఒక గౌరవం, భయం, భక్తి, అన్ని ఉంటాయి. ఖాకి వస్త్రం చూస్తే తెలియని గగుర్పాటు పొడిచే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవన్నీ పోయి ఖాకీ ని చూస్తే అసహ్యించుకునే, తిట్టుకునే పరిస్థితిని తీసుకుని వస్తున్నారు. దానికి కారణం రాష్ట్రంలో గాడితప్పుతున్న పోలీసింగే.
జగనో, చంద్రబాబో కారణం కాకూడదు..!
పోలీసులు గతి తప్పడం జగన్ పరిపాలన అని కాదు. గతంలో చంద్రబాబు పరిపాలించినప్పుడు కూడా పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఇలానే ఏడ్చింది. ఖాకీలను ఖద్దరు శాసిస్తే ఖాకీల విలువ సూన్యానికి పడిపోతుంది. గడచిన ఐదారు రేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నది అదే. పోలీస్ నియామకాల్లో సిఫార్సు లు ఎక్కువై రాజకీయనాయకుల, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల రికమండేషన్ లతో పోస్టింగ్ లు తీసుకుంటున్న ఖాకీలు ఇంగితం మరచిపోయి తాము మనుషులమే అనే కనీస జ్ఞానాన్ని వదిలేసి ప్రవర్తిస్తున్నారు. దీనికి జిల్లా స్థాయిలోనూ, ఉన్నత స్థాయిలో పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఇది కూడా డొంక తిరుగుడుగానే ఉంటున్నాయి తప్ప సూటిగా స్పష్టంగా తప్పును సరిదిద్దుకునేలా ఉండటం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఆశ్చర్యం, భయం రెండు కలగక మానదు. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా డీజీపి స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ వరకు వారి వారి స్థాయిలో ఉన్న ఖద్దరు భజన చేస్తూ గడిపేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది ఇంకాస్త ఇంకాస్త ఎక్కువగా మారింది.
మతిలేని పనులతో పరువు పోగొట్టుకుంటున్నారు
సీతానగరంలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న కారణంగా వైసీపీ నాయకుడి అనుచరుడు పిర్యాదు మేరకు ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత సీతానగరం పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్లి శిరోముండనం చేశారు. ఆ తరువాత తీవ్ర గాయలయ్యేలా కొట్టారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై ఎస్సీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. దీనితో డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించి
ఘటనపై కోరుకొండ డీఎస్పీతో విచారణ చేపట్టారు.ఎస్ఐ, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చాడని చెప్పి పోలీసులు అతన్ని అడ్డుకుంటే అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ యువకుడిని పోలీస్ లు లాఠీలతో కొట్టారు. అనంతరం ఆ యువకుడు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపైనా పెద్ద దుమారం రేగడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. వీటికి పోలీస్ శాఖ నుండి స్పష్టమైన సమాధానం లేదు. రాదు.