నాటి అవమానానికి నేడు ఇలా..!అమరావతి పైన జగన్ ఆలోచన మారింది అప్పుడేనా..!
ఏపీ పరిపాలనా రాజధానిగా ఇప్పటి వరకు కొనసాగిన అమరావతి ఇక..శాసన రాజధానిగా మాత్రమే పరిమితం కాబోతోంది. ప్రభుత్వం ఆలోచనల మేరకు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. అమరావతి అంటే టీడీపీకి చెందిన వారి కోసమే కట్టుకున్న రాజధానిగా..అది ఒక వర్గానికే మేలు చేసే రాజధానిగా వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. అయితే, సీఎం జగన్ మాత్రం అమరావతి పైన ఏనాడు వ్యతిరేకత చూపించలేదు.
రాజధానిగా అమరావతిని ఖరారు చేసిన సమయంలోనూ ప్రతిపక్ష నేతగా సమర్ధించారు. 2019 ఎన్నికల సమయంలోనూ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించిన ఉమ్మెరెడ్డి వేంకటేశ్వర్లు సైతం రాజధాని మార్పు ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు. కానీ, ఆ తరువాత జగన్ మనసులో అమరావతి గురించి ఆలోచన ఎందుకు మారింది. పైకి చెబుతున్నవిధంగా ఖర్చులు.. అవినీతి.. సౌకర్యాలు ఇవన్నీ ఒక కోణంలో నిజమే అయినా..మరో అంశం ఇప్పుడు చర్చకు కారణమైంది.
అమరావతిలో జగన్ కు ఒక రకంగా అవమానం జరిగిందని..దాని ప్రభావమే ఇప్పుడు ఆ ప్రాంతం నుండి పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయానికి బీజం వేసిందనే చర్చ కొనసాగుతోంది. ఇంతకీ..ఆ చర్చ ఏంటి..దాని వెనుక ఉన్న అసలు కధ ఏంటి… పాదయాత్ర సమయంలో పసుపు నీళ్లతో..అమరావతి రాజధాని గా చేసే సమయంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
కొత్త రాష్ట్రం ప్రాంతాల మధ్య విభేదాలకు అవకాశం ఉండకూడ దంటూ తన వాదన వినిపించారు. అదే సమయంలో 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని సూచించారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నా..మాట చెప్పినా వెనకడుగు వేసే అలవాటు తనకు లేదని జగన్ పదే పదే చెబుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు అమరావతి విషయంలో మాత్రం జగన్ మాట తప్పారనే విమర్శలు మొదలయ్యాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి గురించే మాట్లాడారు కానీ, అమరావతిని రాజధానిగా వద్దని ఏనాడు చెప్పలేదు.
ఎన్నికలకు ముందే ఉండవల్లిలో సొంతంగా ఇల్లు నిర్మించుకోవటం ద్వారా తాను సైతం అమరావతి లోనే ఉంటాననే సంకేతాలిచ్చారు. అయితే, అంతకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ రాజధాని గ్రామాల్లో తన యాత్ర కొనసాగించారు. జగన్ పాదయాత్ర చేయటం పైనా అప్పటి వరకు రాజకీయంగా విమర్శలు మాత్రమే చేసిన టీడీపీ.. ఆ గ్రామాల్లో మాత్రం కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది. కొందరు టీడీపీ సానుభూతి పరులు జగన్ పాదయాత్రలో భాగంగా నడిచిన వీధులు అపవిత్రం అయ్యాయంటూ..ఆయన నడిచిన వీధుల్లో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసారు.
అమరావతి రాజధానిగా జగన్ కు ఇష్టం లేదని..అందుకే కోర్టుల్లో కేసులు..అలజడులు రేపుతూ అడ్డుకుంటున్నారనేది అప్పట్లో టీడీపీ ఆరోపణ. అయితే, ఇలా ఒక పార్టీ అధినేత పాదయాత్రం చేసిన వీధుల్లో పసుసు నీళ్లతో శుభ్రం చేయటం పైన సాధారణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. జగన్ అవమానంగా భావించారా…జగన్ తన పాదయాత్రలో రాష్ట్రమంతా పర్యటించినా.. గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా..ఈ రకంగా పసుపు నీళ్లతో శుభ్రం చేయటం మాత్రం వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోయారు.
చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో పదే పదే రాజధానిలో తమ సౌకర్యాల గురించి కలిసిన ఆ ప్రాంత రైతు నేతలు జగన్ సీఎం అయిన తరువాత ఒక్క సారి కలిసిన సందర్భాలు లేవు. రాజధాని పరిధిలోని నియోజక వర్గాలు తాడికొండ..మంగళగిరిల్లో వైసీపీ గెలిచినా… ఆ ప్రాంతంలోని వారు మాత్రం జగన్ ను కలిసి తమ ప్రాంత డెవలప్ మెంట్ గురించి అడిగిన సందర్భం లేదనే విషయం ఇప్పుడు చర్చకు కారణమైంది. పార్టీ నేతలు ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా..అంతర్గత చర్చల్లో మాత్రం ప్రస్తావనకు వస్తోంది.
అయితే, జగన్ తాను నడిస్తేనే సహించలేక..పసుపు నీళ్ళతో శుభ్రం చేయటం వెనుక టీడీపీ ఉన్నా.. ఆయన మాత్రం అది అవమానంగా భావించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దీనిని టీడీపీ నేతలెవరూ ఖండించలేదు. అయితే, ఇప్పుడు రాజధాని మార్పు వెనుక అనేక ఆర్దిక..సాంకేతిక అంశాలను ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా…గతంలో జరిగిన ఈ పరిణామాలు సైతం ఒక కారణం అయి ఉంటుందనే చర్చ ఇప్పుడు రాజధాని గ్రామాల్లోనే వినిపిస్తోంది.