YS Jagan: సీఎం అయిన వేళా విశేషమో.., డెక్క ముక్క ఎరిగిన ప్రతిపక్ష నేత ఉండడమో.. పాలనలో అనుభవాలేమో.., మొండిగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లిపోవడమో.. కారణాలేవైనా అవ్వనీ సీఎం జగన్ మాత్రం రానురాను పొలిటికల్ రిస్కులోకి వెళ్లిపోతున్నారు.. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రిస్కులు ఫేస్ చేస్తూనే ఉన్నారు.. కానీ ఇది మాత్రం అన్నిటికీ మించిన రిస్కు.. తనకు, తన పార్టీకి, ఏపీ రాష్ట్రానికి భవిష్యత్తుని అందించే తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన రిస్కు ఇది..! ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకుని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం సీఎం వైఎస్ జగన్ కు కష్టంగానే కనబడుతోంది. ఇది ఆయన రాజకీయ జీవితంలో పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ కేరీర్ ను మలుపు తిప్పబోతున్నది. ఇంతకూ ఆయన రిస్క్ లో ఉన్న సమస్య ఏమిటీ అంటే..!
YS Jagan: రాజధాని వికేంద్రీకరణ చుట్టూ..!!
ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అంశం హాట్ టాపిక్ గా ఉంది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రభుత్వం పాత బిల్లులను రద్దు చేసేసింది. దీనిపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయడం అందరూ చూశారు. మళ్లీ సమగ్రంగా మెరుగైన బిల్లు తీసుకువస్తామని జగన్ అన్నారు. గతంలో ప్రవేశపెట్టిన బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వాటిని అడ్డం పెట్టుకుని రాద్ధాంతం చేస్తుండటం, రాజకీయ సమస్యలు సృష్టించిన కారణంగా ఆ బిల్లును ఉపసంహరించారు. అయితే సీఎం వైఎస్ జగన్..ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీకి నష్టమేనని పరిశీలకులు విశ్లేస్తున్నారు. మళ్లీ మూడు రాజధానులకు సంబంధించి మెరుగైన బిల్లును జగన్ సర్కార్ తీసుకువచ్చి అసెంబ్లీలో, మండలిలో పాస్ చేసుకుని రాష్ట్రపతికి పంపితే వెంటనే ఆయన ఆమోదిస్తారు, వెంటనే చట్టం అయిపోతుంది. కానీ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మళ్లీ ఏదో ఒక చిన్న లీగల్ పాయింట్ పట్టుకుని తమకు న్యాయం జరగాలంటూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ హైకోర్టులో ఆరు నెలలో సంవత్సరం వరకూ కేసు నడుస్తుంది. ఇప్పటికే రెండేళ్లుగా మూడు రాజదానుల అంశం ముడిపడకపోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నప్పటికీ ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. రాజధానుల అంశం కోర్టు పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి అగిపోయినట్లు ఉందని సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించారు.
,
* మళ్లీ ఇప్పుడు కొత్త బిల్లు తీసుకువస్తే దీనిపైనా కోర్టు వ్యాజ్యాలు అంటూ ఆరు నెలలో, సంవత్సరమో కాలయాపన జరుగుతుంది. ఇక్కడ హైకోర్టులో తీర్పులను బట్టి మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే రెండేళ్లు సమయం వృధా కాగా మరో రెండేళ్లు వృధా అయితే జగన్మోహనరెడ్డి రాబోయే ఎన్నికల నాటికి అభివృద్ధి ఎక్కడ చేశామని ప్రజలకు చెబుతారు. రాజధాని ఏదని ప్రజలకు పేర్కొంటారు. ఒక వేళ కొత్తగా తీసుకువచ్చిన మూడు రాజధానులకు ఎటువంటి అడ్డంకులు రాకపోతే.. అటు విశాఖలో పరిపాలనా రాజధానికి, ఇటు అమరావతిలో శాసన రాజధాని, మరో పక్క కర్నూలులో న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయడానికి, అంటే భవనాల నిర్మాణం, ఇన్ప్రాస్ట్రక్చర్ కల్పనకు ప్రభుత్వం వద్ద నిధులు ఏవి. ప్రస్తుత రాష్ట్ర అర్ధిక పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడమే గగనంగా ఉంది. అప్పులు తీసుకురాకుండా గడవని పరిస్థితి. రాజధానుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కోరాల్సి ఉంటుంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టుకే కేంద్రం నుండి ఇప్పటి వరకూ సక్రమంగా నిధులు ఇవ్వడం లేదు. రేపు రాజధాని నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అన్నది కూడా అనుమానమే. మూడు రాజధానుల వికేంద్రీకరణ వల్ల వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వంపై అంతే ఉంటుంది.
ఒక్కటే రాజధాని అయినా తప్పదు..!?
మరో మారు జగన్ మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల అంశంలో వెనకడుగు వేసే అవకాశం అయితే లేదు, కానీ ఒక వేళ వెనుకడుగు వేసి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటిస్తే … అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం కారణంగా రెండేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందనే అపవాదుతో పాటు మాట తప్పడు, మడమ తిప్పడు అన్న నాయకుడు మాట తప్పాడు, మడమ తిప్పాడు అన్న మాటలను పడాల్సి వస్తుంది. వీటన్నింటికీ తోటు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ వైసీపీ నేతలు పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. ఆ ప్రాంత వాసుల్లో ఆశలను కల్పించారు. అది నెరవేరకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార వైసీపీ కట్టిగా పోరాడుతున్నదీ లేదు. ప్రభుత్వం తరపున కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఈ రెండేళ్లలో ఉత్తరాంధ్రకు ఓ పెద్ద పరిశ్రమను తీసుకువచ్చిందీ లేదు. అదే విధంగా న్యాయరాజధాని అంటూ కర్నూలుకు ఆశలు కల్పించారు. అక్కడా చేసింది ఏమి లేదు. ఆ రెండు ప్రాంతాల ఆశలు నెరవేర్చకుండా న్యాయ చిక్కులు వచ్చాయని రెండు సంవత్సరాలు తాత్సారం చేసిన తరువాత ఇప్పుడు మూడు రాజధానుల అంశంలో వెనుకడుగు వేస్తే వైసీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 50 నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఉండవచ్చని అంచనా. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న సామెతగా వైసీపీ పరిస్థితి కనబడుతోంది. మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, లేక ఒకే రాజధానికి కట్టుబడినా వైసీపీకి 50 నుండి 70 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రభావం కనిపించే అవకాశం ఉంది..!