(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరు నెల రోజులుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్ లు సైతం నిలిచిపోవడంతో ఎప్పుడు బిజీబిజీగా ఉండే ప్రముఖ సినీ నటులు, దర్శకులు ఇళ్లలోనే ఉండి కుటుంబ సభ్యులకు పనులలో సాయం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎవరికి వారు ఇంటి పనులు చేసుకోవడంలో పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ సెలబ్రిటీలు ఏది చేసినా అది మీడియాకు వార్తే, అభిమానులకు పండుగ, స్ఫూర్తి అవుతుంది.
ఈ నేపథ్యంలో ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలని అర్జున్రెడ్డి దర్శకుడు సందీప్ వంగ..’బీ ది రియల్ మ్యాన్’ పేరుతో సరికొత్త చాలెంజ్ను ప్రారంభించగా అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేసి అభిమానులకు కనువిందు చేస్తున్నారు.
ముందుగా సందీప్ వంగ తన ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేస్తూ ఆ వీడియోను ట్వీటర్లో షేర్ చేసి ‘బీ ది రియల్ మ్యాన్’ అని ఛాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్కు రాజమౌళిని నామినేట్ చేశారు. దీంతో చాలెంజ్ పూర్తి చేసిన రాజమౌళి వీడియోను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, ‘బాహుబలి’ నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్లను ఈ చాలెంజ్కు నామినేట్ చేశారు.
ఇది కరోనా మాదిరిగానే
చూస్తుంటే ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ కూడా కరోనా వైరస్ మాదిరిగానే ఒకరి తర్వాత ఒకరికి వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్యానించారు సంగీత దర్శకులు కీరవాణి. రాజమౌళి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కీరవాణి ఇంట్లో బట్టలు ఆరేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆయన ఈ ఛాలెంజ్ కు దర్శకుడు క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని నామినేట్ చేశారు.
పనులు కూడా పంచుకుందాం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి నుండి ఛాలెంజ్ స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పనుల్లో భార్యకు సాయం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘ఇది జక్కన్న కోసం’ అని పేర్కొన్నారు. మన ఇంట్లో ప్రేమలు, అప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందామని పిలుపునిచ్చారు. మనం చేసిన పనులను ఇతరులతో షేర్ చేయడం చాలా ఫన్గా ఉంటుందని తారక్ పేర్కొన్నారు. ఈ చాలెంజ్కు తన బాబాయ్ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివను నామినేట్ చేశారు తారక్.
చిరు పెసరట్టు తయారీ అదుర్స్
హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ చాలెంజ్ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి.. పెసరట్టు తయారీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన చాలెంజ్లో భాగంగా చిరు ఇల్లు శుభ్రం చేశారు. అనంతరం ఉప్మా పెసరట్టు స్వయంగా వేసి తన తల్లి అంజనాదేవికి పెట్టారు.
ఈ సందర్భంగా అంజనాదేవి..చిరుకు పెసరట్టు తినిపించారు. ఈ వీడియోను చిరు తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఈ చాలెంజ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్, హీరో రజనీకాంత్ను నామినేట్ చేశారు. ‘భీమ్(తారక్) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం’ అని చిరు పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ చాలెంజ్ను సినీ ప్రముఖులు రామ్చరణ్, కొరటాల శివ, సుకుమార్ తదితరులు పూర్తి చేశారు.
సినీ సెలబ్రిటీలు ఇంటి పనులు చేయడమే కాకుండా సహచర మిత్రులను స్నేహపూర్వక సవాలు విసురుతుండటంతో టాలీవుడ్లో ‘బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్’ ట్రేండ్ కొనసాగుతోంది. వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైకుల మీద లైక్ లు ఇస్తున్నారు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020