(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్న మాదిరిగానే సమాధానం ఇచ్చారు.
ఇటీవల తమిళ మ్యాగజైన్ అనంద వికటన్కు చిరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని ప్రశ్నించగా వారు రాజకీయాల్లోకి రాకుంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువ ఉండదని చిరు చెప్పారు. రాజకీయాలంటే కేవలం డబ్బు మాత్రమేనని స్పష్టం చేశారు. మంచి చేద్దామని వచ్చినా చేసే అవకాశం ఉండదని చిరు చెప్పుకొచ్చారు.అందుకు తనకు జరిగిన రాజకీయ అనుభవమే ఉదాహరణ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నెంబర్ ఒన్ సినీ స్టార్ని కానీ ఎమి లాభం, సొంత నియోజకవర్గంలోనే పరాజయం పాలయ్యాననీ, ప్రత్యర్థులు తనను ఓడించడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారని చిరు వివరించారు.తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగిందని చిరు అన్నారు. అందుకే చెబుతున్నా వారిద్దరూ రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్ అని చిరు సలహా ఇచ్చారు.
దీనిపై కమల్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ప్రజల్లో మార్పు, చైతన్యం తీసుకువచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని కమల్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచనా ధోరణిపై తనకు అవగాహన పెరిగిందని కమల్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి చిరంజీవి తనకు ఏనాడూ సలహాలు ఇవ్వలేదని కమల్ పేర్కొన్నారు.
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అభిమానుల సమక్షంలో ప్రకటించిన విషయం విదితమే.