Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తొలిసారి నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 11వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, టైలర్లు సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి.
అయితే ఏపీలో `రాధేశ్యామ్` రిలీజ్పై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే, రేపు రిలీజ్ అనగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆన్లైన్ లో ఎలాంటి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఈ విషయమే ప్రభాస్ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశలో ముంచేసింది. టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారా ఎప్పుడు బుక్ చేసుకుందామా అని అభిమానులు ప్రస్తుతం పడిగాపులు కాస్తున్నారు.
కాగా, బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న రాధేశ్యామ్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. హిందీలో మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందించారు . ఇక తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు.