Controlling Rapes: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో వారం రోజుల క్రితం జరిగిన సైదాబాద్ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో రాజు అనే యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి మృగాడుగా ప్రవర్తించాడు. ఆరేళ్ల చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు. అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటంటే వాడికి పెళ్లి అయ్యింది, రెండేళ్ల చిన్నారికి కూడా వాడికి ఉంది. అయినప్పటికీ వాడు ఆరేళ్ల చిన్నారిని తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం, ఆ తరువాత పరారయ్యే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడో లేక ఇంకా ఏదో కారణం చేతనో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య వరంగల్లు జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ పరిధిలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. నిందితుడు రాజును ఎన్ కౌంటర్ చేశారా? లేక ప్రజలే ఆవేశంతో చంపేసి రైల్వే పట్టాలపై పడేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఓ పెద్ద ప్రశ్న. అది పోలీసు దర్యాప్తులో తేలాల్సిన అంశం అనుకోండి. ఆ విషయం పక్కన బెడితే..
ఈ తరహా ఘటనలు గతంలోనూ పలు జరిగాయి. 2015లో ఏలూరులో సురేష్ అని కిరాణా షాపు నిర్వహించే ఓ కుర్రవాడు షాపుకు వచ్చిన ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు ఆ యువకుడిని కోర్టుకు తీసుకువెళుతుంటే పట్టణ ప్రజలే ఆగ్రహంతో పోలీసు జీపు ఆపేసి ఆ యువకుడిని బయటకు లాగి దేహశుద్ది చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. దీంతో ఆ యువకుడు ఆ మంటలను తట్టుకోలేక ఉరుకుతూ వెళ్లి బ్రిడ్జి పై నుండి దూకి చచ్చిపోయాడు. 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ దారుణం జరిగింది. 60 సంవత్సరాలు ఉన్న ఓ ముసలోడు ఓ చిన్న పిల్లను తీసుకువెళ్లి అఘాయిత్యం చేశాడు. వాడిని ఊళ్లో వాళ్లందరూ కొడితే ఆ మరుసటి రోజు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. 2019 డిసెంబర్ లో హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన దిశ ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఘటన దేశ వ్యాప్తంగా కన్నీళ్లు పెట్టేలా చేసింది. నెల రోజుల క్రితమే ఏపి సీఎం వైఎస్ జగన్ క్యాంపు ఆఫీసు సమీపంలోనే సీతానగరం పరిధిలోని కృష్ణానది ఒడ్డున ఒ యువతిని కట్టేసి మానభంగం చేసి హత్య చేశారు. ఆ తరువాత రమ్య ఘటన. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా మండవల్లి సమీపంలో ఓ దంపతులు ఫంక్షన్ కి వెళ్లి బైక్ పై తిరిగి వెళుతుండగా కొందరు దుండగులు భర్తను కట్టేసి భార్యను పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. వాళ్లను ఇప్పటి వరకూ పట్టుకోలేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి.
Controlling Rapes: జరిగిన తర్వాత ఓదారుద్దామా..!?
అయితే ఈ ఘటనలు నివారణకు మార్గం ఏమిటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న..!? దిశ చట్టం ఉంది కాదా, నిందితులను అరెస్టు చేస్తున్నాము కదా, కఠినంగా శిక్షలు వేయిస్తున్నాము కదా, వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నాము కదా.. అని పాలకులు చెబుతుండవచ్చు. కానీ ఇవన్నీ ఘటన జరిగిన తరువాత. ఐపీసీ సెక్షన్లు అన్నీ కూడా నేరం జరిగిన తరువాత శిక్షకు ఉపయోగించేవే. నేరస్తుడికి శిక్ష వేయిస్తారేమో కానీ పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకురాలేరు. బాధిత కుటుంబాల వేదనను ఎవరూ తీర్చలేరు. దిశ ఘటనలో చూసుకున్నట్లయితే వయసులో ఉన్న పశు వైద్యురాలిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసులో నిందితులకు ఏదో విధంగా శిక్ష అయితే పడింది కానీ బాధిత కుటుంబానికి జరిగిన గాయాన్ని ఎవరూ పూడ్చలేనిది. ఈ ఘటనలు అన్నీ చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. అయితే ఇక్కడ పాలకులు ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ దిశగా ఆలోచన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. వ్యభిచారాన్ని చట్టబద్దం చేయడం వల్ల ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ ఏమైనా నష్టం ఉందా అనేది ఆలోచన చేయాలి. ఇది చట్టబద్దం చేయడం వల్ల ఇటువంటి వెధవలు ఎవరైనా ఉంటే వాడి కోర్కెలను తీర్చుకునేందుకు ఆ కొంపలకు వెళతాడు, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటాడు. మద్యం తదితర చెడు అలవాట్లు ఉన్న వాడు వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. అదే విధంగా దీనికి ఖర్చు పెట్టుకుని వెళతాడు. చాలా దేశాలలో వ్యభిచారం చట్టబద్దం అవ్వడం అక్కడ ఇటువంటి ఘటనలుబాగా తగ్గాయి. మన దేశంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో అధికారికంగానే నిర్వహిస్తున్నారు.
ఏపీలో రేపులు ఎలా పెరుగుతున్నాయో..!?
ఏపిలో 2019లో 1086 రేప్ కేసులు జరిగాయి. 2020లో కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ 800 జరిగాయి. ఈ ఏడాడి ఆగస్టు 15వరకూ 885 ఘటనలు జరిగాయి. ఈ గణాంకాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. అయితే వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే ఈ ఘటనలు కొంత మేర తగ్గే అవకాశం ఉందనేది ఒక వాదన. ప్రస్తుతం కూడా అనేక గ్రామాలు, పట్టణాల్లో వ్యభిచారం జరుగుతూనే ఉంది కానీ రహస్యంగా చాటుమటుగా జరుగుతోంది. అనేక దాడుల్లో వ్యభిచారులను విటులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా రహస్యంగా జరుగుతున్న దానికి చట్టబద్దత కల్పించి దానికి ఒక ప్రదేశాన్ని కేటాయిస్తే ఇటువంటి వాంఛ ఉన్న వాళ్లు అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేయకుండా వాడు వేశ్యావాటికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటువంటి తరహా నేరాలు జరగకుండా ఉండేందుకు పాలకులు వేశ్యావాటికలు చట్టబద్దంగా నిర్వహించే ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఇక్కడ కూడా ఆ తరహా చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందేమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బహుశా దీని వలన మహిళలల నుండి తిరుగుబాటు రావచ్చు అని పాలకుల్లో కొంత భయం ఉండవచ్చు.. కానీ ఇటువంటి దారుణాలు కట్టడికి అటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తెగింపే..!
ఇన్ని చెప్పుకున్నాక ఏపీలో గత ప్రభుత్వం చేసిన ఒక ఆలోచనను కూడా గుర్తుచేసుకోవాలి.. 2018లో దాచేపల్లి ఘటన, ఆపై వరుస ఘటనలతో దీనికి పరిష్కారం వెతికే క్రమంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని.. పట్టణ ప్రాంతాల్లో ప్రాధమికంగా అనుమతివ్వాలని నాటి సీఎం చంద్రబాబు ఆలోచించారట.., కానీ పార్టీలో కొందరు వ్యతిరేకించడం.., కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత రావడంతో.. ఎన్నికల ముందు ఈ రిస్కు ఎందుకులే అని చంద్రబాబు ఆ ఆలోచనను విరమించుకున్నారట..!