RRR: ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. దాదాపు 70 శాతం వైసీపీ కైవశం చేసుకుంది. అదే విధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, ఆ తరువాత జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే..ఏపిలో గత రెండు మూడు నెలల నుండి రాజకీయాలు మారుతున్నాయి. గతంతో పోలిస్తే టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అవుతోంది. అక్టోబర్ 29వ తేదీ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం, ఆ ఘటనను పురస్కరించుకుని చంద్రబాబు రెండు రోజుల దీక్ష చేయడంతో ఆ పార్టీ క్యాడర్ లో యాక్టివ్ అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఏమిటో తెలియాలంటే ఒక ఉప ఎన్నిక రావాల్సి ఉంది. ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. 2020 మార్చి నుండి రఘురామ సొంత పార్టీకి రెబల్ గా మారిన విషయం తెలిసిందే.
RRR: జగన్ సీరియస్ ఎఫెక్ట్
వైసీపీలో జరుగుతున్న తప్పులను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను, పార్టీలోని ఇతర వ్యవహారాలను ఆయన రచ్చబండ వేదికగా మీడియా ముందుకు తీసుకువచ్చి ప్రజలకు వివరిస్తున్నారు. ఆయన ప్రతి ప్రెస్ మీట్ కు టీడీపీ అనుకూల మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రఘురామ చేస్తున్న పనుల వల్ల ఏడాదిన్నర కాలంగా వైసీపీ తీవ్ర ఇరుకున పడుతోంది. ఇంత చేస్తున్నా ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన్ను సస్పెండ్ చేస్తే స్వతంత్ర ఎంపీగా పార్లమెంట్ లో కూర్చునే అవకాశం ఏర్పడుతుంది. ఆయనపై అనర్హత వేటు వేసే హక్కును కోల్పోతుంది. రఘురామపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయడం లేదు. రఘురామపై సీఎం జగన్ సీరియస్ ఎఫెక్ట్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఆయనపై అనర్హత వేటు వేయడానికి నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఇంతకు ముందు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితర వైసీపీ ఎంపిలు కేంద్రానికి రఘురామపై ఫిర్యాదు చేసినా అంతగా స్పందన రాకపోవడంతో నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..రఘురామ అనర్హత పిటిషన్ పైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దానికి తోడు రఘురామ కంపెనీపై ఉన్న సీబీఐ కేసులోనూ తాజాగా చార్జిషీటు దాఖలైంది.
సర్వేల్లో సానుకూలతతో..
ఈ తరుణంలో ఇంకా ఎక్కువ కాలం ఇలా రెబల్ ఎంపిగా ఉండటం కంటే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి తమ బలం ఏమిటో నిరూపించుకోవాలన్న ధోరణికి రఘురామ వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన తన నియోజకవర్గంలో రెండు మూడు సంస్థలతో సర్వేలు కూడా చేయించుకున్నారుట. ఆ సర్వేల్లో ఆయనకు కొంత సానుకూలత కనబడటంతో ఉప ఎన్నికలకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే నర్సాపురంలో త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల అది అధికార వైసీపీకి లాభం చేకూరుతుందని భావించిన ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వైసీపీతో తలబడేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. ప్రతిపక్ష పార్టీలు అన్నీ తమ అభ్యర్ధులను పెట్టకుండా తనకు మద్దతు ఇస్తే గెలుస్తానన్న నమ్మకంలో ఆయనలో ఉంది. త్వరలో ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయమని భావిస్తున్నారు. ఒక వేళ అనర్హత వేటు పడకపోయినా రఘురామ స్వయంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.