Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్రతో కలిసి తన తదుపరి చిత్రం కోసం పని చేస్తున్నాడు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీని తెరకెక్కించి బాబీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ కు ఓ మాస్ మసాలా కథ చెప్పి మెప్పించాడు. గత ఏడాది నవంబర్ లో వీరి ప్రాజెక్ట్ ఎన్బీకే109 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం అయింది.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో డైరెక్టర్ బాబీ బాలకృష్ణ 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఫిక్స్ అయ్యారు. అలాగే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడని.. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో అలరించబోతోందని ఇన్సైడ్ టాక్ ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బాలయ్య, బాబీ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఎన్బీకే 109 మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా.. `వీర మాస్`. కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని డైరెక్టర్ బాబీ భావిస్తున్నాడట. బాలయ్య మరియు నిర్మాతలకు కూడా టైటిల్ నచ్చిందట. దీంతో ప్రొడ్యూసర్ నాగవంశీ వీర మాస్ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే గత ఏడాది సంక్రాంతి సీజన్ లో హీరో బాలకృష్ణకు మరియు డైరెక్టర్ బాబీకి వీర పేరు బాగా కలిసొచ్చింది. వీర సింహా రెడ్డి మూవీతో బాలకృష్ణ, వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి వీర మాస్ టైటిల్ పరిశీలనలో ఉంది. మరి వీర సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇటు బాలయ్యకు ఇటు బాబీకి మరో హిట్ ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఎన్బీకే 109 చిత్రం 2024లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు త్రిష, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, పాయల్ రాజ్పుత్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ బాలయ్యతో జతకట్టేది ఎవరు అన్నది మాత్రం ఇంకా తేలలేదు.