టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లో ఎప్పటికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించింది. నాజర్, ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇందులో ముఖ్య పాత్రలను పోషించారు. 2006లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. ఘనవిజయం సాధించింది.
అప్పట్లోనే రూ. 80 కోట్లను వసూల్ చేసిన ఈ చిత్రం.. ఎన్నో రికార్డులను తిరగరాసి మహేశ్ కెరీర్ లో ఓ మైల్స్టోన్గా నిలిచింది. అయితే నిన్న మహేశ్ 47వ పుట్టిన రోజు సందర్భంగా.. `పోకిరి` సినిమాను అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 లొకేషన్లలో 4కె వెర్షన్లో స్పెషల్ షోలు వేశారు.
పోకిరి విడుదలై 16 ఏళ్లు అయిపోయింది. అయినా సరే ఈ మూవీ స్పెషల్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీ రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్స్ దర్శనమిచ్చాయి. దీంతో స్పెషల్ షోల ద్వారా నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పలు థియేటర్లలో స్పెషల్ షో ప్రదర్శించబడిన ఈ సినిమా నుంచి నిర్మాతలు సుమారుగా రూ. 3 కోట్లకు పైగా లాభాలను అందుకున్నారని అంటున్నారు. ఇక మరోవైపు `పోకిరి`తో పాటు పలు చోట్లు `అతడు`ను సైతం రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ నిర్మాతలకు రూ. 60 లక్షల వరకు లాభాలు వచ్చాయని టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. మహేశ్ మ్యానియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.