Uppena Hindi Remake: ఉప్పెన.. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. హీరోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్కు, హీరోయిన్ గా కృతి శెట్టికి మరియు డైరెక్టర్ గా బుచ్చిబాబు సానాకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ రొమాంటివ్ లవ్ డ్రామాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
తమిళ స్టార్ విజయ్ సేతుపతి, గాయత్రి జయరామన్, సాయిచంద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. డెబ్యూ మూవీతో హైయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని తొలి ఇండియన్ హీరోగా వైష్ణవ్ రికార్డు సృష్టించాడు. అలాగే ఉప్పెన విజయంతో డైరెక్టర్ బుచ్చిబాబు తన రెండో సినిమానే ఏకంగా గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబో ప్రాజెక్ట్ రీసెంట్ గానే `ఆర్సీ 16` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైంది. ఇందులో బోనీ కపూర్-శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఆర్సీ 16 పూజా కార్యక్రమం వేడుకలో జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నట్లు తెలిపారు.
అంతేకాదు, తన రెండో కూతురు ఖుషి కపూర్ ని ఒకసారి ఉప్పెన మూవీ చూడమని కూడా చెప్పానని బోపీ కపూర్ పేర్కొన్నారు. మొత్తానికి ఉప్పెన మూవీ హిందీలో రీమేక్ చేస్తే హీరోయిన్ గా ఖుషి కపూర్ నటిస్తుందని బోనీ కపూర్ చెప్పకనే చెప్పేశారు. హీరో ఎవరు అన్నది మాత్రం ఆయన హిట్ ఇవ్వలేదు. కాగా, ఖుషి కపూర్ ఆర్చీస్ అనే మూవీలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ తనయుడు సుహానా ఖాన్ కూడా ఈ మూవీలో నటించారు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఆర్చీస్ మూవీకి పెద్దగా ప్రజాదరణ దక్కలేదు. ప్రస్తుతం ఖుషి కపూర్ ను హీరోయిన్ గా నిలబెట్టే పనిలో బోనీ కపూర్ ఉన్నారు.