నాని ట్వీట్ తో టీడీపీలో కలకలం…
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలని టీడీపీ అధినేత డిమాండ్ చేస్తున్నారు. దీని పైన ప్రతీ రెండు రోజులకోసారి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి సవాళ్లు చేస్తున్నారు. అయితే, పార్టీ అధినేత వాదనకు ఆశించిన స్థాయిలో మద్దతు మాత్రం లభించటం లేదు. అక్కడక్కడ కొందరు నేతలు మాత్రమే అధినేత వాయిస్ గా మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అయితే, 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీలు మాత్రం ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోద మద్ర లభించిన తరువాత స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక ట్వీట్ చేసారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా చంద్రబాబును ఉద్దేశించి చేసినవే. అమరావతి కలలు సాధ్యం అవ్వాలంటే పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదని చెప్పుకొచ్చారు. రాజధాని పరిధిలో..అందునా విజయవాడ నుండి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతోంది.
నాని ట్వీట్ ..టార్గెట్ చంద్రబాబు
విజయవాడ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని తొలుత వ్యతిరేకించిన కేశినేని కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తరువాత సైతం ఆయన స్పందించలేదు. విజయవాడ నగరానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం నిత్యం మీడియా ముందుకొచ్చి..అమరావతి రైతుల వద్దకు వెళ్లి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీలు మాత్రం ఈ విషయంలో దూరం పాటిస్తున్నారు. అందునా అమరావతి రాజధాని పరిధిలోని గుంటూరు..విజయవాడ ఎంపీలుగా ఇద్దరూ టీడీపీ నుండి గెలిచిన వారే. అయితే అందులో గల్లా జయదేవ్ అసలు కొంత కాలంగా అందుబాటు లేరనే ప్రచారం ఉంది. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని అమరావతి వ్యవహారం పైన సడన్ గా ట్వీట్ చేసారు. అందులో నేరుగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందులో ఆయన చేసిన సూచనలు .. పరోక్షంగా ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.
మన కలలు మనమే సాధించుకోవాలి..
కేశినేని నాని చేసిన ట్వీట్ లో ..మన కలలు మనమే సాకారం చేసుకోవాలి మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో @JaiTDP అధికారంలోకి రావాలి ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు..అంటూ ట్వీట్ చేసారు. కొద్ది రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల ద్వారా చేస్తున్న సవాళ్లు..స్టేట్ మెంట్స్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారనే చర్చ సాగుతోంది. దీంతో పాటుగా తన సొంత జిల్లాలో టీడీపీ నేతల తీరు పైన 2019 ఎన్నికల ముందు నుండే కేశినేని నాని వ్యతిరేకంగా ఉన్నారు. జిల్లాలోని కొందరు తీరు వలనే జిల్లాలో అనేక నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పార్టీ అభ్యర్ధులు ఓడిపోయారంటూ ఆయన గతంలోనే వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు బెజవాడ టీడీపీ నేతలు సైతం నిత్యం మీడియా స్టేట్ మెంట్స్ ఇస్తుండటంతో అందరినీ ఉద్దేశించి చేసిన ట్వీట్ గా కనిపిస్తోంది. ఇప్పుడు దీని పైన టీడీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో ప్రధానంగా బెజవాడ నుండి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.