సాయంత్రం పూట, రాత్రి పూట ఎక్కువ తింటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందనేదానికి ఆధారాలు పెరుగుతున్నాయి. సాయంత్రం కాస్త ముందు భోజనం చేస్తే బరువు తగ్గుతుందనీ, కాస్త ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరుగుతుందనీ ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఆలస్యంగా భోజనం చేసేవారిలో మధుమేహం, గుండె జబ్బులకు దారి తీసే లక్షణాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనాలు సూచించాయి. ఖచ్చితంగా నిర్ణీత వేళలకు ఆహారం తీసుకోవడం వలన రక్తంలో చక్కెర శాతం నియంత్రించవచ్చని కూడా ఒక అధ్యయనంలో బయటపడింది.
తాజాగా మరో అధ్యయనం ఫలితాలు కూడా ఈ సాక్ష్యాధారాలను బలపరిచే విధంగా ఉన్నాయి. సాయంత్రం తర్వాత ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళితే మహిళల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. ఫిలడెల్ఫియాలో జరుగుతున్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ సమావేశాల్లో ఈ అధ్యయనం నివేదికను సమర్పించనున్నారు. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని నిర్వహించారు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువ ఆహారం తీసుకున్న మహిళల గుండె ఆరోగ్యం ఎంత ఎక్కువ తీసుకున్నారన్నదానికి తగ్గట్లుగా క్షీణించినట్లు ఈ అధ్యయనం సూచించింది. గుండె ఆరోగ్యం విషయంలో ఇంతకాలం ఏం తినాలి, ఎంత తినాలి అన్న అంశాలపైనే దృష్టి కేంద్రీకృతం అయిందనీ, ఇప్పుడు ఎప్పుడు తినాలి అన్న అంశం కూడా ముఖ్యమేనన్న విషయం బయటపడిందనీ పరిశోధకులు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.