Turkish Airlines: టర్కీలో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. దాదాపు 30 వేల మందికి పైగా మరణించడం జరిగింది. ఐదువేలకు పైగా భవనాలు కూలిపోయాయి. దీంతో చాలా చోట్ల శిధిలాల కింద జనాలు ఇరుక్కుపోయారు. సహాయక బృందాలు తీవ్రస్థాయిలో కష్టపడి… జనాలను బయటకు తీస్తున్నారు. టర్కీ భూకంప బాధితులను ఆదుకోవడానికి వివిధ దేశాల మిలటరీ… సహాయక బృందాలు కూడా భారీ ఎత్తున కష్టపడుతూ ఉన్నాయి. ఆస్తి నష్టం తో పాటు భారీ ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగింది. ఇటువంటి తరుణంలో టర్కీ భూకంప బాధితులను ఆదుకోవడానికి టర్కీష్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
విషయంలోకి వెళ్తే భూకంప బాధితులకు విమాన ప్రయాణం ఉచితమని స్పష్టం చేసింది. ఇదే రీతిలో పెగసాస్ ఎయిర్ లైన్స్ కూడా ముందుకు రావడం జరిగింది. దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలైన ఇస్తాంబుల్, అంకారా, అంటల్యా సహా ఇతర ప్రాంతాలకు ఉచితంగా విమానంలో చేరవేస్తామని ప్రకటించాయి. భూకంపంలో సర్వం కోల్పోయిన ప్రజలకు అక్కడి ప్రభుత్వం సురక్షితమైన యూనివర్సిటీ హాస్టల్స్, కళాశాలలలో, పర్యాటక ప్రాంతాలలో, హోటల్స్ లో ఉచితంగా ఆహారంతో పాటు వసతి కల్పిస్తూ ప్రజలను ఆదుకుంటూ ఉంది.
పరిస్థితి ఇలా ఉంటే చాలా మంది తమ వారిని కోల్పోయామని బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో సాయం చేయాల్సింది పోయి కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో టర్కీ ప్రభుత్వం అప్రమత్తమయ్యి ఎక్కడికి అక్కడ భద్రతా బలగాలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడుతున్న వారిని పట్టుకొని జైలలో పెడుతూ ఉంది. భూకంపం కారణంగా ఆగ్నేయ టర్కీలోని 10 ఫ్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇదే సమయంలో ఎక్కడ దోపిడీలు మరియు కిడ్నాప్ లు జరగకుండా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.