బిట్వీన్ ది లైన్స్
స్పెక్యులేషన్ మీడియా రచనల్లో ఒక అంతర్భాగం. ఇలా జరిగేందుకు అవకాశం ఉందని ఊహామాత్రంగా స్ఫురిస్తే దానికి చిలువలు పలవలు చేర్చి కథనాలు రాసేస్తుంటాం. పాఠకుడికి కొత్త సమాచారం ఇస్తున్నామన్న దానికంటే చదువరుల్లో ఆసక్తి రేకెత్తించగలిగితే చాలు రీడర్షిప్ పెరుగుతుంది. అది పత్రికకు ప్రయోజనదాయకంగా ఉంటుంది.
పొలిటికల్ స్పెక్యులేషన్ స్టోరీల్లో మాత్రం కొంత మోటివేషన్, ఇంటర్నల్ అజెండా దాగి ఉంటాయి. ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడమో, తాము సానుభూతి వహించే పార్టీ, లేదా నాయకుడికి కొంత నైతికస్థైర్యం కల్పించడమో, పాఠకులను పక్కదారి పట్టించే ఎత్తుగడో అక్షరాల మాటున అంతర్లీనంగా ఒదిగి ఉంటుంది. నడుస్తున్న చరిత్రను బేరీజు వేసుకుంటూ భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం తప్పుకాదు. తప్పు పట్టనూ లేము. అయితే ఆ కథనం ఏ ప్రయోజనాలకు ఉద్దేశించింది? అందులో అక్షరాల మాటున అందిస్తున్న సందేశమేమిటన్నదే ముఖ్యం. అజెండా సెటింగ్లో అది ఒక భాగమా కాదా అన్నదే తరచి చూడాల్సిన అంశం.
ఎదిగినట్టా..? పెంచినట్టా..?
ఈ వారం ఆంధ్రజ్యోతిలో, గడ్కరీని ప్రధానిగా, శివరాజ్ సింగ్ చౌహాన్ను బీజేపీ అధ్యక్షునిగా ఎంచుకునే దిశలో ఆర్ఎస్ఎస్ ఆలోచన చేస్తోందంటూ ఒక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఉద్యమమే చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే యుద్ధమే చేస్తున్నారు. ఇది సిద్ధాంతపరమైన వైరం కాదు, రాజకీయ అవసరం. స్థానికంగా ప్రభుత్వంపై ఏర్పడుతున్న వ్యతిరేకతను కేంద్రంపై నెట్టివేసి ఆంధ్రప్రదేశ్ నిస్సహాయ స్థితిలో ఉందన్న సెంటిమెంటును, సానుభూతిని సృష్టించాలి. తద్వారా ఓటు బ్యాంకును పుట్టించుకోవాలనేది ఎత్తుగడ. అదే సమయంలో బీజేపీకి దూరం కావడమూ ఇష్టం లేదు. అందుకే మోదీని మాత్రమే టార్గెట్ చేస్తూ టీడీపీ, రాష్ట్రప్రభుత్వమూ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రజల్లో ఇప్పటికీ సందిగ్ధత ఉంది. నిన్నామొన్నటివరకూ మోదీని భుజాలపైకి ఎత్తుకుని ఇటువంటి ప్రధాని భారతదేశ చరిత్రలోనే ఇంతవరకూ లేరని వ్యాఖ్యానించిన చంద్రబాబు హఠాత్తుగా ఎందుకిలా మారిపోయారు. ఆయన చెబుతున్నది నిజమా కాదా? లేక ఎన్నికల రాజకీయమా? ఇటువంటి సవాలక్ష సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. దానికి సమాధానమే ప్రధానిగా గడ్కరీ అభ్యర్థిత్వ పరిశీలన కథనం.
టీడీపీ క్రెడిబిలిటీ పెంచే వ్యూహం…
మోడీ, అమిత్ షాల వైఖరిని కేవలం చంద్రబాబు మాత్రమే వ్యతిరేకించడం లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ సైతం వారిని సహించలేకపోతోంది. అందుకే బీజేపీ సంపూర్ణ ఆధిక్యత సాధించలేకపోతే వారిని మార్చేందుకు ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోందన్న భావాన్ని పాఠకుల్లో బలంగా పాతుకుపోయేలా చేయడమే కథనం ఉద్దేశం. దీనివల్ల బీజేపీ స్థానిక శ్రేణుల్లోనూ అనుమానాలు రేకెత్తుతాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్నది తప్పు కాదన్న మాట, పేరెంట్ ఆర్గనైజేషనే వారిని అభిశంసించే పరిస్థితులున్నాయన్న మాట అని పాఠకులు భావించాలనేది కథనంలోని అంతర్గత సారాంశం.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఇంతవరకూ ముగ్గురు ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రతిపాదించాయి. ఒకరు వాజపేయి . ఆయన నెహ్రూ కాలం నుంచే పార్లమెంటేరియన్ గా పనిచేయడమే కాకుండా జనసమ్మోహక శక్తిగా గుర్తింపు పొందారు. రెండవ వ్యక్తి అద్వానీ, రథయాత్రతో బీజేపీలో ఉత్సాహాన్ని పెంచారు. దశదిశలా పార్టీ ఖ్యాతిని వ్యాపింపచేశారు. కార్యకర్తల పార్టీని జనాకర్షక పథం వైపు మళ్లించగలిగారు. మూడో వ్యక్తి మోదీ. బీజేపీలో అత్యంత వివాదాస్పదమైన ముఖ్యమంత్రిగానే కాకుండా పార్టీకార్యకర్తలు రొమ్ము విరుచుకునేలా సిద్ధాంతనిబద్ధతతో పన్నెండేళ్లపాటు అప్రతిహతంగా గుజరాత్ ను పాలించారు . ఆయనకున్న జనాదరణను పార్టీకి ప్రజాసమ్మతిగా మలచుకోవాలనే మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో ఎంపిక చేశారు. పైమూడు ఉదాహరణల్లోనూ పబ్లిక్ సపోర్టు పూర్తిగా ఉన్నవారినే ప్రధాని అభ్యర్థులుగా ఎంచుకోవడం మనకు కనిపిస్తుంది.
గడ్కరీకి అంతటి ఘనచరిత్ర లేదు. అంతటి ప్రజాకర్షణ, ఆదరణ లేదు. కనీసం యోగి ఆదిత్యనాధ్ తరహాలో కరడుగట్టిన మత భావనలూ లేవు. అటువంటి స్థితిలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు తమ భుజాలపై ఆయనను కూర్చోబెట్టుకుని పరాభవ భారం తాము భరించేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతానికి పార్టీలోనూ, బయటా మోడీకి మోడియే ప్రత్యామ్నాయం. అయినప్పటికీ గడ్కరీని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రధాని రేసులోకి తీసుకురావడంలో ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయి?
కృష్ణ సాయిరాం