Jamili Elections: జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికల అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకోవడంతో దీనిపై రకరకాల ఊహగానాలు నడుస్తున్నాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు నెలల్లో తన నివేదిక సమర్పించనున్నది. ఆ తర్వాత కమిటీ సిఫారసులను అమలు చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా అటు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసిందో లేదో జమిలి ఎన్నికలు, పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అనే దానిపైనా చర్చ జరుగుతోంది. “ఒకే దేశం – ఒకే ఎన్నిక” ప్రతిపాదనపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదన భారతదేశంపై, దేశంలోని అన్ని రాష్ట్రాలపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇండియా కూటమి ఏర్పటైన తర్వాత కేంద్ర సర్కార్ లో భయంపట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరవ్ భరద్వాజ్ అన్నారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకువచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ .. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పేరుతో జమిలి ఎన్నికలకు నిర్వహించేందుకు కుట్ర చేస్తొందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. జమిలి ఎన్నికల విధాన పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడమే విడ్డూరంగా ఉందని అన్నారు.
మాజీ రాష్ట్రపతులు మళ్ల రాజకీయ ప్రవేశం చేయకూడదని, రాజకీయ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న సంప్రదాయాన్ని కూడా బేఖాతరు చేశారని అన్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతారన్న నమ్మకంతోనే బీజేపీ ఆయనను కమిటీ చైర్మన్ గా పెట్టిందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల ప్రత్యేక చట్టం అమలులోకి వస్తే డీఎంకే సహా ఏ పార్టీ దేశంలో మనుగడ సాగించలేదనీ, దేశమంతా వన్ మేన్ షో గా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన నెలకొల్పి తాను దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న మోడీ ఆశలను నెరవేర్చుకునేందుకే ఈ జమిలి ఎన్నికల కుట్ర అని ఆయన దుయ్యబట్టారు. అడ్డదిడ్డంగా ఈ ప్రత్యేక చట్టాలు చేయడానికి బదులు ప్రధాని మోడీయే ఇకపై దేశాధ్యక్షుడని ప్రకటిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
జమిలిపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం చూస్తొందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇలాంటి వార్తలు అన్నీ మీడియా ఊహగానాలేనని ఆయన అన్నారు. ప్రధాని మోడీ తన పదవీ కాలంలో చివరి రోజు వరకూ దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. త్వరలో కొన్ని రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించే ఆలోచన కూడా లేదని తెలిపారు. వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందనీ, దీనికి సంబంధించి తుది నిబంధనలు ఖరారు చేసే ముందు కమిటీ అన్ని పక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతుందని చెప్పారు.
ఉన్నత స్థాయి కమిటీలో లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా చోటు కల్పించడం మోడీ ప్రభుత్వ విశాల దృక్పదానికి నిదర్శమని మంత్రి అన్నారు. ఈ నెల 18 నుండి అయిదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం సన్నద్దం అయితే దానిపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈ సమావేశాల కోసం కేంద్రం భారీ ప్రణాళిక సిద్దం చేసిందని చెప్పిన మంత్రి ఠాకూర్ .. సమావేశాల అజెండాను మాత్రం వెల్లడించలేదు. ఈ అజెండాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తగిన సమయంలో వివరిస్తారని ఆయన తెలిపారు.
CM YS Jagan: దేశం మొత్తం ఉలిక్కిపడే బిల్లు ఏపీ అసంబ్లీ లో ప్రవేశపెట్టబోతోన్న జగన్ !