సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం ద్వారా మంచినీటి అవసరాలకు వాడాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అందులో ఆరితేరిన ఇజ్రాయెల్ కి చెందిన ఐడిఈ కంపెనీ ప్రతినిధులతో నిన్న సమావేశమయ్యారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే రాజధాని కాబోతున్న విశాఖలో కీలక సమస్యకి పరిష్కారం దొరికినట్టే. అత్యంత పొడవైన సముద్ర తీరమున్నఆంధ్ర ప్రదేశ్ లో అసలు నీటి కొరత అనేదే ఉండదు. అయితే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దీనిపై మరింత లోతుగా తెలుసుకుందాం…!
చెన్నైలో ఏం జరుగుతుంది…?
ఇండియాలో మొదటిసారిగా ఈ ఆలోచన రావడం, అమలు చేయడం చెన్నైలో జరిగింది. చెన్నైలో నీటి కొరత, నీటి విద్యుత్ తయారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పదేళ్ల కిందట దీన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. చెన్నై సమీపంలోని కట్టుపల్లి అనే గ్రామంలో సముద్ర తీరాన “మింజుర్ డీశాలినేషన్ ప్లాంట్ ” ఉంది. 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, దేశంలో ఇదే పెద్ద ప్లాంట్ గా ఉంది. రూ. 5 వేలకోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. రివర్స్ ఆస్మాసిస్ (నీటి శుద్ధిలో ఇది ఒక ప్రక్రియ) విధానం ద్వారం దీన్ని నడుపుతున్నారు. రోజుకి వంద మెగా లీటర్లు నీటిని డీశాలినేషన్ చేస్తున్నారు. చెన్నైలోని ఉత్తర భాగంతో పాటూ, విద్యుత్ ఉత్పత్తికి ఈ నీటిని వినియోగిస్తున్నారు. దేశంలోని అనేక తీరా ప్రాంతాల్లో ఇదే విధానంలో అమలు చేసి, నీటి కొరతని అధిగమించవచ్చని నీటి ఆయోగ్ నాలుగేళ్ళ కిందటే చెప్పింది.
విశాఖకు ఇదొక్కటే మార్గం…!
విశాఖలో రాజధాని అనగానే చాల మందిలో రేకెత్తుతున్న మొదటి ప్రశ్న అక్కడ నీటి కొరతని ఎలా అధిగమిస్తారు? అని. ఇదే… సముద్రపు నీటి డీశాలినేషన్ మాత్రమే దానికి సమాధానం. అందుకే రాజధాని తరలింపు ఆలోచనల్లో భాగంగానే ఆ సమస్యలకు పరిష్కారం సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. దీనిలో భాగమే అత్యవసరంగా ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో సమావేశమవ్వడం. వారు డిపిఆర్ ఇచ్చి, దీన్ని ఆమోదించాక ఏడాదిలో నీటి శుద్ధిని ఆరంభించవచ్చు. ఈ లోగా రాజధాని మార్పు ప్రక్రియ, భవనాల నిర్మాణం కూడా కొలిక్కి వస్తుంది. విశాఖ, భీమిలి తో పాటు ఈ ప్లాంట్ నెలకొల్పడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, విశాఖలోని స్టీల్ ప్లాంట్ సహా, నగరంలోని కొన్ని ప్రాంతాలకి ఈ నీటిని అందించాలనేది సీఎం యోచనగా చెప్తున్నారు. ఏదైనా కీలక సమస్యకి అత్యున్నత పరిష్కారం చూపడం, మంచి చర్చనీయాంశమయ్యింది. ఇది అమలు జరిగితే ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి లాంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయిలో ప్లాంట్లు నెలకొల్పి నీటి అవసరాలు తీర్చుకునే వీలుంది. – శ్రీనివాస్ మానెం