ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెజాన్ నుండి పార్శిల్ రాగానే ఆ యువతి తాను ఆర్డర్ చేసిన అత్యాధునిక మొబైల్ వచ్చిందని ఆ యువతి ఆనందపడిపోయింది.సంబరంగా ఆ పార్సెల్ విప్పి చూసేసరికి షాక్ కావడం ఆమె వంతైంది.
మొబైల్ ఫోన్ కి బదులు ఆ పార్శిల్లో కేవలం రెండు ఫ్రూటీ ప్యాకెట్లు ఉండటంతో ఆ యువతికి మతిపోయింది.వెంటనే విషయాన్ని అమెజాన్ సంస్థకు తెలియజేసి ఫిర్యాదు పంపినా మా తప్పేమీ లేదు మేము మొబైల్ ఫోనే పంపామని ఆ సంస్థ వాదిస్తుండటంతో సదరు యువతి కి ఏం చేయాలో పాలుపోవడం లేదు.ఇది ఎక్కడో జరిగిన సంఘటన కాదు.మోసపోయిన యువతి అమాయకురాలు కాదు.మోసం చేసిన సంస్థ చిన్నాచితకది కాదు.వివరాల్లోకి వెళితే హైద్రాబాద్కు చెందిన డాక్టర్ అనుష్క దసరా పండగ సందర్భంగా అమెజాన్ సంస్థ ప్రకటించిన బిగ్ మేళా లో డిస్కౌంట్ ధరకు లభిస్తుందన్న ఆశతో అత్యాధునికమైన ఒక ఫోనుకు ఆర్డర్ చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు కట్టేసింది.
ఆ తర్వాత మూడు రోజులకు అనుష్కకు అమెజాన్ సంస్థ నుండి పార్సిల్ వచ్చింది.అయితే అనుష్క ఆర్డర్ చేసింది గిఫ్ట్ప్యాక్ కాగా ఆ పార్శిల్ నార్మల్ ప్యాక్ లో రావడంతో ఆమెకు అనుమానం వచ్చి సదరు పార్శిలుని విప్పే ప్రక్రియను వీడియో లో చిత్రీకరించింది.ఆ పార్శిల్ను అనుష్క విప్పి చూడగా అందులో నుండి రెండు ఫ్రూటీ ప్యాకెట్లు కనిపించాయి.దీంతో అనుష్క హతాశురాలైంది.వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేసింది.తాను తీసిన వీడియోను కూడా జతచేసింది.అయితే వారు సమాధానం కూడా ఇవ్వలేదు.అనుష్క వెంటబడడంతో వారం రోజుల తర్వాత సమాధానం ఇస్తూ తాము ఈ ఘటనపై విచారణ జరిపామని,అయితే తమ తప్పేమీ లేదని, తాము ఆ పార్శిల్లో మొబైల్ ఫోనే పంపామని తేల్చేశారు.
ఈ విషయమై తదుపరి తాను ఎన్నిసార్లు ఎంతో మంది అమెజాన్ ఎగ్జిక్యూటివ్ లతో ఈమెయిల్స్ ,వాట్సాప్ ద్వారా చర్చించినా వారినుండి తాము మొబైల్ ఫోనే పంపామన్న సమాధానం వస్తోంది తప్ప తనకు న్యాయం జరగడం లేదని అనుష్క వాపోయింది .చివరకు అమెజాన్ హెడ్డాఫీసు కూడా ఈ విషయమై ఈమెయిల్ పంపితే సమాధానం కూడా కరువైందని తెలిపింది.ఇరవై ఎనిమిది వేల రూపాయల ఫోనుకు బదులు తనకు ఇరవై రూపాయల ఫ్రూటీ ప్యాకెట్ లు పంపటం ఎంత దారుణమని ఆమె ఆక్రోశించింది .తనకు న్యాయం జరగకపోతే అమెజాన్ సంస్థ కార్యాలయం ముందు దీక్ష చేస్తానని అనుష్క తెలిపింది.సాధారణంగా ఇలాంటి మోసాలను బోగస్ సంస్థలు చేస్తాయి కానీ అమెజాన్ సంస్థ కూడా అలా చేసిందంటే ఇక ఎవరిని నమ్మాలి?