విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు వీలు లేదని ఆంక్షలు విధించారు. దీన్ని దేవినేనితోపాటు ఆయన అనుచరులు ప్రతిఘటించారు. తాము నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, దేవినేని అనుచరులకు మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరోవైపు రాజధాని వికేంద్రీకరణపై కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తుళ్లూరు నుంచి భారీ ఎత్తున ప్రజలు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. అయితే, అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన రైతులు, మహిలలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది పోలీసులను దాటుకుంటూ అసెంబ్లీవైపు పరుగులు తీశారు.