ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 6న సీఎం జగన్.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి మోదీతో చర్చించడం కోసం జగన్.. ఆయన్ను కలవబోతున్నారు.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ మీట్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాను జగన్ కోరారు. దానితో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిల విషయం గురించి కూడా అమిత్ షాతో సీఎం చర్చించారు.
ప్రధానితో కూడా ఇవే అంశాల గురించి జగన్ ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను త్వరగా విడుదల చేయాలని ప్రధానిని జగన్ కోరనున్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 5న ఉదయం సీఎం జగన్ పులివెందుల వెళ్లి… ఆరోజు తన మామ గంగిరెడ్డి కర్మకాండలకు హాజరై.. అక్కడి నుంచి రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. 6న ఉదయమే ప్రధాని మోదీని జగన్ కలుసుకుంటారు.