మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల అంశంపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలో అయన మీడియాతో మాట్లాడారు. నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దద్దాలు చెబుతున్నారని అన్నారు. శివ రామ కృష్ణన్ కమిటీ నివేదిక లోనూ మూడు రాజధానుల అంశం ఉందని బొత్స అన్నారు. నాడు కేంద్రం నియమించిన కమిటీ మూడు రాజధానుల విషయం ప్రస్తావించిందని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు నియమించిన నారాయణ కమిటీ మాత్రం అమరావతిని ప్రతిపాదించింది అని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్క సామాజిక వర్గం కోసం రాజకీయం చేస్తున్నారని బొత్స విమర్శించారు.
ప్రజల ముంగిట్లోకి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ, కొత్త జిల్లాలు ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ లని బొత్స గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు సమానం గా అభివృద్ధి చెందుతాయని, రాష్ట్రంలోని ప్రజానీకం అంతా దీన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానుల విషయం లో శాసన మండలి చైర్మన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని అన్నారు. కర్నూలు, అమరావతి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బొత్స పునరుద్ఘాటించారు.
అసెంబ్లీ అమరావతిలో కొనసాగించాలన్న నిర్ణయం పట్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు సంతోషించారని అదే విధంగా కర్నూలు జిల్లా ప్రజలు చిర కాల కోరిక తీరిందని భావిస్తున్నారని బొత్స అన్నారు.
మూడు రాజధానుల అంశానికి సంబంధించి సీఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదం కొరకు ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను ఆమోదించ వద్దంటూ టీడీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గవర్నర్ కు లేఖలు రాసాయి.