దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో తాజా పరిస్థితులపై ఏడు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధాన మంత్రి మోదీ ఫోన్లో సంభాషించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఏపి సిఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లకు ఫోన్ చేశారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు పరీక్షల వివరాలపై చర్చించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంలో ఏపిలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంపై సీఎం జగన్ ను మోడీ ప్రశంసించినట్లు తెలుస్తింది.
ఏపి, తెలంగాణ సీఎంలతో పాటు బీహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రదాన మంత్రి మాట్లాడారు. అప్రకటితంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కాల్ రావడంతో ముఖ్య మంత్రులు అప్రమత్తమయినట్లు సమాచారం. తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తదుపరి కార్యాచారణకు సిద్దం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారని, అందుకే ముఖ్యమంత్రులతో ఆయన స్వయంగా మాట్లాడారని తెలుస్తోంది. సోమవారం మరి కొందరు ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడతారని ఆ తర్వాత కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తదుపరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.