ఏపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు పరిణామాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో తమ్మినేని సీతారామ్ కీలక ఉపన్యాసం చేశారు. శాసన వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యంపై తమ్మినేని ప్రసంగించారు. శాసన వ్యవస్థకు రాజ్యాంగం నిర్ధిష్టమైన అధికారాలు ఇచ్చింది కానీ ఇటీవల కాలంలో న్యాయస్థానాలు పదేపదే జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. శాసనసభ, శాసనమండలి చట్టాలను చేస్తాయన్నారు. అయితే తరచు న్యాయస్థానాలు శాసన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం అవాంఛనీయమని అన్నారు. న్యాయస్థానాలు పోరాట ధోరణిలో జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించారు.
ఏపి అసెంబ్లీ, మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఎ రద్దు చట్టాలు చేశామనీ కానీ కోర్టులు ఆ బిల్లులకు ఆటంకం కల్గించాయని చెప్పుకొచ్చారు. రాజకీయ దురుద్దేశంతో ఆ అంశంలో పిటిషన్లు దాఖలు అయ్యాయని అన్నారు. కోర్టులు అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
భారత రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) 71వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే స్పీకర్ ల సదస్సు (80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్) గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టణంలో నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హజరై కీలక ఉపన్యాసం చేశారు.