ఇదొక చిత్రమైన పరిస్థితి. వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో హోరా హోరీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారం కోసం.. ఈ రెండు పార్టీలు కూడా కృషి తో నాస్తి.. అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో ఇటు వైసీపీ అధినేత జగన్, అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒకరి కోసం మరొకరు.. అన్నట్టుగా మరింత కష్టపడుతున్నారు. దీంతో వారి రాజకీయం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా.. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. ఇది సహజం కూడా. అధికారం కోసం.. అధికారం తప్ప.. పార్టీలకు మరో ప్రయోజనం లేదని విశ్వసించే ఈ రోజుల్లో.. పార్టీల మధ్య ఈ తరహా పోటీ ఉండడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు చిత్రం ఏంటంటే.. వైసీపీ, టీడీపీల అధినేతలు ఒకరిని ఓడించాలని మరొకరు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుండడమే గొప్పవిషయం.
ఈ తరహా రాజకీయం ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. పార్టీల అధినేతలపై పోటీ పెట్టినా.. అదే టార్గెట్గా ఏ పార్టీ కూడా తీసుకోలేదు. కానీ, 2018లో పడిన రాజకీయబీజం.. ఇప్పుడు అధినేతలను ఒకరికొకరు ఓడించుకునే పరిస్థితి తెరమీదికి వచ్చింది. 2018లో అప్పటి విపక్ష నాయకుడు జగన్ను స్వయంగా చంద్రబాబే టార్గెట్ చేశారు. అప్పటి వరకు పార్టీల అధినేతలను ఓడించాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఈ క్రమంలోనే జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు చంద్రబాబు నిధులు పారించారు.
పొరుగున ఉన్న రాజంపేట నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన.. మేడా మల్లికార్జున రెడ్డి నిధులు అడిగినా.. ఇవ్వకుండా.. పులివెందులకు మాత్రం 200 కోట్లు కేటాయించి పట్టిసీమ నుంచి నీటిని పారించారు . రోడ్డు వేశారు. ఇవన్నీ.. జగన్ను ఓడంచేందుకు చంద్రబాబు చేసిన పనులుగా వైసీపీ ప్రచారం చేసుకుంది. ఇక, ఇప్పుడు ఇదే పనిని చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జగన్ చేస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరు ఓడతారో లేదో తెలియదు కానీ, నియోజకవర్గాలు మాత్రం బాగుపడుతున్నాయి.