గత కొద్దికాలంగా అందరి చూపు కరోనా మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందా? అనే దానిపైనే పడిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అంటూ అంతా ఎదురుచూస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందులోనూ వైఎస్సార్సీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వల్ల కావడం గమనార్హం. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు.
విజయసాయిరెడ్డి ప్రశ్నతో
కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఆదివారం వైఎస్ఆర్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మంత్రి సమాధానం ఇస్తూ వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఐ) అనుమతించినట్లు మంత్రి అశ్విన్ కుమార్ చౌబే చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్, అహ్మదాబాద్కు చెందిన కాడిలా హెల్త్కేర్, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఉన్నట్లు తెలిపారు.
కేంద్రం ఏం చేస్తోంది?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్ పరిశోధనలకు సాయపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే చెప్పారు. కోవిడ్ 19 టెస్ట్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్ -19 టెస్ట్లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే తెలిపారు. అలాగే కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలాఉండగా ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు కోవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషి తుది దశకు చేరిన సంగతి తెలిసిందే.